అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.
#ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం.
#అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా నేటిధాత్రి:
ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావు పళ్లి గ్రామం మీదుగా గణేష్ పళ్లి వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ పనులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో మొదటి దఫాగా ప్రతి నియోజకవర్గానికి ఐదువేల ఇండ్లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని, ములుగు నియోజకవర్గానికి సంబంధిత మంత్రి మరో వెయ్యి ఇండ్లను అదనంగా కేటాయించనున్నారని వివరించారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం, రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు ములుగును మున్సిపాలిటీగా, మల్లంపల్లి గ్రామాన్ని జేడి మల్లంపల్లిగా మండలం గా ఏర్పాటు చేశామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు.
తాను ఎంపీ బలరాం నాయక్ కలిసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు మంత్రి సీతక్కతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.