ప్రజలకు అండగా నిలిచిన వరంగల్ పోలీసులు
వరద నీటిలో ప్రభుత్వ అధికారుల సేవలు..
సహాయక చర్యల్లో నిమగ్నమైన మిల్స్ కాలనీ సీఐ రమేష్, సిబ్బంది..
సహాయక చర్యల్లో పాల్గొన్న వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్.
నీట మునిగిన వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్
వరంగల్ తూర్పు, నేటిధాత్రి.
వరంగల్లో కుండపోత వర్షం కురిసిన కారణంగా స్తంభించిన జనజీవనం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలైనా వివేకానంద కాలనీ, ఎస్సార్ నగర్, సాయిగణేష్ కాలనీ, మధురానగర్ శివనగర్, ఎన్టీఆర్ నగర్, కరీమాబాద్, మిల్స్ కాలనీ, గరీబ్ నగర్, శాకరాశికుంట, డి కే కొమురయ్య నగర్ లు జలమయమయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్, అలాగే నీట మునిగిన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లిన మిల్స్ కాలని సిఐ రమేష్, పోలీసు సిబ్బంది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదంటున్న పోలీసులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
టోల్ ఫ్రీ కి కాల్ చేయండి..
నగరంలో తెల్లవారు జామున కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అత్యవసర సహాయం కోసం అధికారులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లను సూచించారు. వరంగల్ జిల్లాకు 1800 425 3434, 9154225936, జిడబ్ల్యూఎంసి 1800 425 1115, హనుమకొండ 1800 425 1980, 9701999676 లకు కాల్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.
