కోర మీసాలు,ఉగ్రరూపంలో వేట వెంకటేశ్వర స్వామి…
కొలిచిన వారికి కొంగు బంగారం…
ఆపద మొక్కులు తీర్చే వేట వెంకటేశ్వర స్వామి…
వేటకు వచ్చి మర్రిగూడెంలో వెలసిన వేట వెంకటేశ్వర స్వామి…
మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు…
నేటి ధాత్రి – గార్ల :-
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న వేట వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు.
ఈ ఆలయం భక్తులకు అత్యంత ప్రితిపాత్ర మైనది.
వేట వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం యాటపోతులను బలి ఇచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
కోరిన కోరికలను తీర్చమని ముడుపులు కట్టి మేకపోతుని బలి ఇస్తారు.
వెంకటేశ్వర స్వామికి మేకను బలివ్వడం ఆశ్చర్యం కలిగించినప్పటికీ ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.
వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.
వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో అశ్వ వాహన రూపాన్ని వదిలి వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధరించిన ప్రదేశంలో గోపాద ముద్రలు దర్శమిస్తాయి.
ఇక్కడికి వచ్చే భక్తులు ముందు గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతే వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు.
సంతానలేమిటో బాధపడే భార్యా,భర్తలు కళ్యాణం కోసం ఎదురుచూసే యువతి,యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నించే ఉద్యోగార్థులు, ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు
ఈ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి తమ కోరికలను తీర్చాలని,తమ కష్టాలను గట్టేక్కించాలని మొక్కుకుంటారు.
శాలివాహన శకం 1525 శ్రీముఖ నామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ విదియ శుభదినాన స్వామి వారు ఇక్కడ అవతరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి.
క్షేత్ర పాలకూడిగా హనుమంతుడు కొలువై ఉన్న ఈ దేవాలయంలో ఆల్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం.
ప్రతి ఏటా అశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వేట వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.
వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం భారతదేశమంతట ఎక్కడ వెతికిన దొరకదు.
ఈ వింత ఆచారం మర్రిగూడెంలోని వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.
పాతకాలం నాటి పంచలోహ విగ్రహాలను, స్వామివారి ఆభరణాలను ఉత్సవాల అనంతరం గార్ల దేవాలయం లో భద్రపరిచి ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన
ఈ ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం రివాజు.
అశ్వయుజ పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో జరిగే కళ్యాణానికి డోర్నకల్ మండలం, అమ్మపాలెం గ్రామం నుంచి తెచ్చిన తలంబ్రాలతో వేద పండితులు కళ్యాణాన్ని వైభవంగా జరిపిస్తారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వయంగా వేటాడుతూ ఈ ప్రాంతానికి విచ్చేసి మర్రిగూడెం సమీపంలో వెలసినట్టు భక్తుల విశ్వాసం.
ఆలయం ఎదుట గల కోనేరు తేప్పోత్సవమును ఘనంగా నిర్వహిస్తారు.
తిరునాళ్ల ఉత్సవానికి మహబూబాబాద్ జిల్లా నలుమూలల నుండి కాక, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కృష్ణ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను తిలకిస్తారు.
ఇంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం అభివృద్ధికి ఎమ్మెల్యేలు,ఎంపీలు చొరవ చూపాలని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఆలయం అభివృద్ధికి పాటుపడాలని భక్తులు కోరుతున్నారు.