హైదరాబాద్లో జరిగే టీజేఎస్ ప్లీనరీ విజయవంతం చేయాలి
నర్సంపేట, నేటిధాత్రి:
ప్రజల ఉమ్మడి పోరాటం, అమరుల బలిదానాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, సామాజిక ప్రజాస్వామిక లౌకిక తెలంగాణ సాధనకు ఈ నెల 12న హైదరాబాద్లో జరిగే తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీని విజయవంతం చేయాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.వరంగల్లో గురువారం జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్తో కలిసి ప్లీనరీ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఉద్యమ ఆకాంక్షల సాధనకు అడుగులు వేయక నియంతృత్వ పాలన సాగించిందని, కాంట్రాక్టర్లు, కమీషన్లు, నోట్లు, ఓట్లు, సీట్ల కేంద్రంగా పాలన సాగిందని విమర్శించారు.కేసీఆర్ పాలనలో జరిగిన అప్రజాస్వామిక, శ్రామిక వ్యతిరేక చర్యలను నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా ఉద్యమ నిర్మాణంలో టీజేఎస్ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. నిరుద్యోగం, బీసీ రిజర్వేషన్ల పెంపు, విద్యా వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక అంశాలపై నిరంతర పోరాటం కొనసాగిస్తున్నామన్నారు.ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా సాగుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆ పార్టీకి మద్దతు ఇచ్చి గెలుపులో భాగమైనప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ వైపుగా కృషి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితిలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణపై విస్తృత చర్చలు నిర్వహిస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ప్రజలను సంఘటితం చేస్తూ టీజేఎస్ ముందుకు సాగుతోందని చెప్పారు.గతాన్ని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు మే 12వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో నిర్వహిస్తున్న ప్లీనరీకి ప్రజలందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోనగాని రవీందర్, గుంటి రామచందర్, సుల్తి సాయికుమార్, మహబూబ్ అలీ, మహమ్మద్ సందాని, గుంటి సంజీవ తదితరులు పాల్గొన్నారు.
