ధాన్యంకొనుగోల్లలో వేగం పెంచాలి..
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
జిల్లా కలెక్టర్ తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే సమీక్ష.
నర్సంపేట,నేటిధాత్రి:
అకాల వర్షాలు,గాలిబేవత్సానికి రైతులు నష్ట పోకుండా ధాన్యం కొనుగోలుల పట్ల వేగంపెంచాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.సోమవారం నర్సంపేట రైతు వేదికలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రబి కాలంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో అధిక వరి దిగుబడి వచ్చిందని, ఇప్పటివరకు 40 శాతం ధాన్యం కొనుగోలు చేసారని అన్నారు. క్షేత్ర స్థాయిలో మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి అధికారులు ధాన్యం నిలువ వివరాలు సేకరించి ,దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా లారీలను, హమాలీలను ఏర్పాటు చేసుకొని వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు.రైస్ మిల్లర్లకు సామర్ధ్యాన్ని బట్టి వెంటనే కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొంత మంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో రైతులను ఇబ్బం దులు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ట్రక్ షీట్ ప్రకారమే తీసుకోవాలని కోతలు విధిస్తే ఉపేక్షించేది లేదన్నారు. 1638 రకం ధాన్యం ను గ్రేడ్ ఏ క్రింద పరిగణించి వాటిని తిరస్కరించకుండ తీసుకోవాలని తెలిపారు.ఎక్కువ నూకలు వస్తున్నాయని బోయిల్డ్ రైస్ క్రింద తీసుకోనుటకు అనుమతించాలని మిల్లర్లు ఎమ్మెల్యే కు తెలుపగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే అన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ ను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో 1.07 మెట్రిక్ టన్నుల అంచనా ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 31.54 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. , ఇంకను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓపిఎం ఎస్ నమోదు వెంటనే చేయాలని,తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలను వెంటనే ఖాళీ చేసే ప్రయత్నం చేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకూడదని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు.అవసరమగు లారీలు సమకూర్చాలని జిల్లా రవాణా అధికారిను కలెక్టర్ ఆదేశించారు.
హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద సకాలంలో అన్లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షించాలన్నారు. తగినంత టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
ఈ సమీక్ష లో ఆదనవు కలెక్టర్ సంధ్యా రాణి, నర్సంపేట మార్కేట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.