కొమురెల్లి మల్లన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది

కొమురవెల్లి నేటిధాత్రి….

కనికరించిన రైల్వే శాఖ

గంగిరేగి చెట్టుకింద కొలువై గండాలను తీర్చే కొమురెల్లి మల్లన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి దర్శనం కోసం సుదూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రయాణ వెతలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్‌లో కొత్తగా కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రులు.

గత కొన్ని నెలలుగా పలు రైల్వే అధికారులకు, కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులకు రైల్వే హల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కోరిక నెరవేరింది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ దాస్ యాదవ్ ఫిబ్రవరి 15న కొమురవెళ్లి రాజీవ్ రహదారి సమీపాన రైల్వే హల్ట్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. రైల్వే హల్ట్ స్టేషన్ కల నెరవేరినందుకు మల్లన్న భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోరిన వారి కోర్కెలు తీర్చే కొమురవెళ్లి మల్లన్న భక్తుల ప్రయాణ కష్టాలు కొద్దీ రోజుల్లో తీరనున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెళ్లి మల్లన్న స్వామివారి ఆలయానికి ఏటా సుమారు 80 లక్షల మంది భక్తులు పలు జిల్లాల నుండి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించు కోవడానికి తరలివస్తారు. కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైన్ లో భాగంగా కొమురవెళ్లి మల్లన్న ఆలయ సమీపాన పలు రాష్ట్రాల నుండి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. గతంలో దుద్దేడ, లకుడారం రైల్వే స్టేషన్ లను ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. కొమురవెళ్లి రాజీవ్ రహదారి స్వాగత తోరణం గుండా ఆలయానికి చేరుకోవల్సి వచ్చేది.

భక్తులకు రైల్వే స్టేషన్ లేకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ అధికారులు పలుసార్లు మొరపెట్టుకున్నారు. ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పురుషోత్తం రూపాల, గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కు కొమురవెళ్లి సమీపాన రైల్వే హల్ట్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రలు ఇవ్వడం జరిగింది. భక్తుల, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్పందించిన దక్షిణ మధ్య రైల్వే డియర్ఎం లోకేష్ వైష్ణవ్ స్వామివారిని దర్శించుకుని రైల్వే హల్ట్ స్టేషన్ పరిశీలించారు. మరి కొన్ని నెలాల్లో మల్లన్న చెంత రైల్వే హల్ట్ స్టేషన్ ఏర్పాటు పనులు పూర్తి చేసి పలు రాష్ట్రల నుండి వచ్చే భక్తుల కష్టాలు తీరుస్తామని అధికారక ప్రకటన చేశారు. అలాగే హల్ట్ స్టేషన్ లో షెల్టర్, హైలెవల్ ఫ్లాట్ ఫామ్, వెయిటింగ్ రూమ్, నీటి సరఫరా, టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. కొమురవెళ్లి రాజీవ్ రహదారి సమీపాన ఆలయానికి వచ్చే క్రమంలో ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూమిపూజ చేయనున్నారు.

కొమరవెల్లిలో వీరశైవ ఆగమాచారం వర్సెస్ గొల్లకురుమ ఆచారం. కొమరవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలో ఎంతో ప్రత్యేకం. ఇక్కడ జరిగే జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొమరవెల్లి మల్లన్నకు మూడు నెలల పాటు జాతర జరగడం ఒక విశేషం. అంతే కాదు ఇక్కడ పట్నాల నిర్వహణ మరింత ప్రత్యేకం. కొమరెల్లి మల్లన్న గుడిలో రెండు సార్లు లగ్గాలు జరుగుతాయి. ఒకటి మార్గశిర మాసంలో కాగా.. మరొకటి శివరాత్రికి. ఈ రెండు లగ్గాలు బలిజ – ఒగ్గు కళాకారుల అధ్వర్యంలో జరుగడం తరతరాల సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే మల్లన్న దర్శనానికి తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version