టీజీ పాలిసెట్–2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులు సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలి-ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి
పరకాల,నేటిధాత్రి
టీజీ పాలిసెట్–2026 ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్,కన్వీనర్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు,తల్లిదండ్రులు తేదీలను గమనించి అవసరమైన అన్ని సర్టిఫికెట్లతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరకాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి సూచించారు.మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 27,2026 నుండి జూన్ 31,2026 వరకు ఆన్లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, బేసిక్ సమాచారం నమోదు,సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు.సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 29,2026 నుండి జూలై 1,2026 వరకు జరుగుతుందని పేర్కొన్నారు.వెరిఫికేషన్ అనంతరం జూలై 3, 2026 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.అలాగే తుది విడత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 15,2026 నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.విద్యార్థులు ఆలస్యం చేయకుండా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని సూచించారు.ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరకాలను టీజీ పాలిసెట్ కౌన్సిలింగ్ హెల్ప్లైన్ సెంటర్గా ప్రభుత్వం గుర్తించిందని ప్రిన్సిపాల్ తెలిపారు.పరకాల పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్,కౌన్సిలింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవాలని కోరారు.ఇందుకోసం విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ పరకాల హెల్ప్లైన్ సెంటర్ను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ పరకాలలో ప్రస్తుతం డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్,డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఈఈఈ),బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నూతన కోర్సులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ పరకాల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి కోరారు.
