అమర వీరుల త్యాగఫలం తెలంగాణ స్వరాష్ట్రం…
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల…
నేటి ధాత్రి గార్ల:
ఎందరో అమర వీరుల త్యాగఫలం
తెలంగాణ స్వరాష్ట్రమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలోని తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం విశ్వ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని విశ్వ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పాలకుల అసమర్ధత, నిధుల దుర్వినియోగం, అవినీతి, బంధుప్రీతి, ప్రాంతీయ వివక్షత, ప్రాంతీయ నిధుల మళ్లింపు, నీళ్ల దోపిడీ తదితర అవలక్షణాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారాయని అన్నారు. అధికార పంపిణీ, నిధుల పంపిణీ అన్ని ప్రాంతాలకు సమానంగా జరగకుండా చేస్తూ ప్రాంతాల, సమూహాల, కులాల,తెగల మధ్య అసమానతలను ప్రోత్సహించడం పాలకులకు సరైనది కాదని ఆయన పాలకులను హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత జల దోపిడికి, నిధుల దోపిడీకి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందన్నారు. ఒక్క జిల్లాకు ముగ్గురు మంత్రులను కేటాయిస్తూ కొన్ని జిల్లాలకు అసలు మంత్రులనే కేటాయించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాళోజీ మాటలను గుర్తు చేస్తూ “ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటే దాకా తన్ని తరుముదాం – ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదాం” అనే నినాదంతో తెలంగాణ ప్రజలు అంతర్గత దోపిడి, వివక్షతలను ఎదిరిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే అభివృద్ధిగా భావించడం వల్ల భవిష్యత్తు సమాజానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. గద్దర్ అవార్డుల ఎంపిక గద్దర్ పోరాట స్ఫూర్తి కి తెలంగాణ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా నిర్వహించడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని దీన్ని పాలకులు గుర్తించి తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన యదవ పలికారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు వజ్రం నాగేశ్వరరావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్,సిపిఐ నాయకులు పోతుల నరసింహారావు, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి కృష్ణ, దీకొండ రాము, తెలంగాణ ఉద్యమకారులు నాగాచారి, ఎస్కే జానీ, మల్లి బాబు, పిల్లలమర్రి వీరస్వామి, కొమ్మరాజు జగదీష్, శ్రీను, పల్లెబోయిన మోహన్ యాదవ్, వల్లపు దాసు వెంకటేశ్వర్లు, మధులకర్ శివాజీ, ఎట్టి రామ దొర, బాలాజీ నాయక్, కాముని శ్రీనివాస్, కత్తి బాలరాజు,మైస ఐలేష్, మహిషా అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.