మున్సిపల్ ఎన్నికలు.. తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో వైన్స్ బంద్…

మున్సిపల్ ఎన్నికలు.. తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో వైన్స్ బంద్

◆-: రేపు సాయంత్రం వరకు ఆంక్షలు

◆-: ఓట్ల లెక్కింపు రోజైన 13న కూడా మద్యం అమ్మకాలపై నిషేధం

◆-: నిబంధనలు మీరితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారుల హెచ్చరిక

◆-: 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎల్లుండి పోలింగ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారం ముగిసే సమయమైన ఇవాళ‌ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల‌ 13వ తేదీన కూడా పూర్తిస్థాయిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోనే అమల్లో ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా వర్తించవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల‌ 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం 2,996 వార్డులకు అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version