స్టాలిన్కు పట్టాభిషేకమా?
విజయ్ సంచలనమా?
తమిళనాడు రాజకీయ పీఠం కోసం సాగుతున్న ఈ మహా సంగ్రామం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు చేరుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన “సంక్షేమ మంత్రాన్ని” నమ్ముకుని మరోసారి కోటపై జెండా ఎగురవేయడానికి సిద్ధమవుతుండగా, తాజా ఓపీనియన్ పోల్ ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. డీఎంకే కూటమి 121 సీట్లతో మళ్లీ అధికారాన్ని దక్కించుకోబోతోందని ఈ సర్వే చెబుతున్నప్పటికీ, అది కేవలం మిత్రపక్షాల అండతోనే సాధ్యమని తేల్చి చెప్పంది. సొంతంగా మెజారిటీ సాధించలేక పోవడం స్టాలిన్ టీమ్కు కాస్త కలవరపెట్టే అంశమే.
మరోవైపు, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటమి 83 స్థానాలతో గట్టి పోటీ ఇస్తూ అధికారం కోసం వేచి చూస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో అసలైన “ఎక్స్ ఫ్యాక్టర్” మాత్రం సినీ నటుడు విజయ్ రూపంలో తెరపైకి వచ్చింది. ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ కేవలం మూడు సీట్లకే పరిమితమైనా, ఏకంగా 24.71 శాతం ఓట్లను కొల్లగొట్టి ప్రధాన పార్టీల లెక్కలన్నీ తలకిందులు చేయడానికి సిద్ధమైంది. విజయ్ సాధించబోయే ఈ భారీ ఓట్ షేర్ అటు డీఎంకే, ఇటు ఏఐడీఎంకే అభ్యర్థుల గెలుపోటములను శాసించే రేంజ్లో ఉండబోతుంది.
ఈ ఎన్నికల యుద్ధంలో అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సుమారు 27 నియోజకవర్గాల్లో ఫలితం ‘టాస్’ వేసినట్లుగా అత్యంత స్వల్ప తేడాతో మారే అవకాశం ఉందని సర్వే పేర్కొనడం. ఈ హోరాహోరీ స్థానాలే తమిళనాట అసలైన కింగ్ ఎవరో తేల్చనున్నాయి. ఏప్రిల్ 23న జరగబోయే ఈ పోలింగ్ సమరంలో తమిళ ఓటరు స్టాలిన్కు పట్టం కడతాడా లేక విజయ్ ఎంట్రీతో సమీకరణాలు మారి సరికొత్త ట్విస్ట్ ఎదురవుతుందా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
