రోడ్డు నడవడానికి వీలులేని స్థితిలో ఉంది…!!!
◆”-: 15 సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం జరిగింది
◆”-: ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడింది
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరసంగం మండలంలో మేదపల్లి నుంచి ఏడులపల్లికి వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారి గులకరాళ్లతో నిండి, నడవడానికి వీలులేకుండా ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని మేదపల్లి, ఎడులపల్లి, వనంపల్లి, సిద్దాపూర్, చిలేపల్లి, ఎల్గోయి, కృష్ణాపూర్ వంటి గ్రామాలకు వెళ్లే రహదారులను 15 సంవత్సరాల క్రితం వేశారు. అయితే, ఇప్పుడు అవి ధ్వంసమయ్యాయి… కంకర బయటపడటంతో, వాహనదారులు మరియు ప్రజలు ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. కంకర రోడ్డుపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా, కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సులను రద్దు చేశారు. దీని కారణంగా, విద్యార్థులు మండల కేంద్రమైన ఝరసంగంలోని వివిధ పాఠశాలలకు రావడానికి ప్రైవేట్ ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు మరియు ప్రజలు సంబంధిత అధికారులు కనీసం ఇప్పుడైనా స్పందించి, గుంతలు పడి కంకర బయటపడిన రోడ్లను మరమ్మతులు చేయాలని అభ్యర్థిస్తున్నారు.
