పెట్రోల్ బంకుల్లో సేవల లోపం…

పెట్రోల్ బంకుల్లో సేవల లోపం

అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేల చూసుకోవాలని వాహనదారుల డిమాండ్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని పలువురు పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు సక్రమంగా అందుబాటులో లేకపోవడం గమనార్హం.ముఖ్యంగా టైర్లలో గాలి నింపేందుకు ఏర్పాటు చేసిన ఎయిర్ కంప్రెసర్లు పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొన్ని బంకుల్లో ఎయిర్ కంప్రెసర్లు పాడైపోయి ఉండగా,మరికొన్ని చోట్ల నిర్వహణ లోపంతో పనిచేయడం లేదు.దీంతో వాహనదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి గాలి నింపించుకోవాల్సి వస్తోంది.అత్యవసర పరిస్థితుల్లో ఈ లోపం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.కొన్ని బంకుల్లో పనిచేసే సిబ్బంది వాహనదారుల ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడం,సరైన సహకారం అందించకపోవడం వంటి అంశాలు వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వెంటనే స్పందించి,ఎయిర్ కంప్రెసర్లతో పాటు ఇతర అవసరమైన సేవలను కూడా సక్రమంగా అందుబాటులో ఉంచాలని వాహనదారులు కోరుతున్నారు.అన్ని బంకుల్లో అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!

#అన్నదాతలకు, ప్రజలకు తప్పని తిప్పలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల ప్రజలకు, అన్నదాతలకు కంకర రోడ్లతో కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మండల వ్యాప్తంగా పలు లింకు రోడ్లకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని కొంత మేరకు పనులు చేపట్టారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి పనులు నిలిచిపోయాయి. దీంతో కంకర తేలిన రోడ్లపై అన్నదాతలు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నడక సైతం నరకప్రాయంగా మారిన దుస్థితి నెలకొంది. మండలంలోని గుండ్ల పహాడ్ నుండి మేడేపల్లి వరకు, నారక్క పేట నుండి నర్సంపేట మండలం రామ్ నగర్ వరకు, ముచింపుల నుండి నందిగామ వరకు, నల్లబెల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి అనుములోని పల్లె వరకు, కొండాలపల్లి నుండి గుంటూరు పల్లె వరకు అక్కడి నుండి పెద్ద చెరువు కట్ట చివరి వరకు. తారు రోడ్ల నిర్మాణం కోసం 2023 జనవరిలో ఎం ఆర్ ఆర్ గ్రాంటు కింద నిధులు మంజూరు అయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఫార్మేషన్ పూర్తి చేసి కంకర వేసి తొక్కించారు. ఆ సమయంలోనే సాధారణ ఎన్నికలు రాగా పనులు ఆపివేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి నుండి రెండేళ్లగా కంకర తేలిన రోడ్లపైనే రైతులు, ప్రజలు ప్రయాణం సాగించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై నడవవలసి వస్తుండడంతో దుక్కి టేద్దులు కాళ్లు పగిలిపోయి అనారోగ్యం పాలవుతున్నాయి. పలుమార్లు కాళ్లకు రక్త గాయాలైన కొన్ని దుక్కి టేద్దులు కంకర రోడ్లపైకి తీసుకువస్తే బెంబేలెత్తి పారిపోతున్న దుస్థితి చోటుచేసుకుంది. రోడ్ల పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఏది ఏమైనాప్పటికీ కంకర రోడ్లపై తక్షణమే తారు రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు కొనసాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

#సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తాం.
కాంట్రాక్టర్లు ఫార్మేషన్, కంకర పనులు పూర్తి చేయగా బీటీ పనులు మాత్రమే మిగిలాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి ఆదేశాల మేరకు పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

రజనీకాంత్, స్పెషల్ ఏఈ, పిఆర్ శాఖ.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version