మొదటి విడత పోలింగ్ కేంద్రాల పరిశీలన
సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి నర్సంపేట నేటిధాత్రి:
గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం వర్ధన్నపేట మండలం ఇళ్లంద, కొత్తపల్లి, రాయపర్తి మండలం దుబ్బతండ, రాగన్నగూడెం, పర్వతగిరి మండలం ఏబీ తండా, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది డ్యూటీల అమలు, పోలింగ్ సాగుతున్న విధానం, భద్రతా చర్యలు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు. సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయంలేని వాతావరణం కల్పించడం సిబ్బందిపై ఉన్న ప్రధాన బాధ్యతని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ఔచిత్యం కలదని కలెక్టర్ స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ సుమా,నోడల్ అధికారులు,ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
