విధాన లోపం – విద్యకు శాపం…
నేటి ధాత్రి – గార్ల :-
గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ.19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం పెట్టిన ముద్దు పేరు హేతుబద్దీకరణ. అందరికి అందుబాటులోకి విద్యను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలల విస్తరణ చేపట్టి “పల్లె పల్లెకో పాఠశాల” నినాధంతో గత ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలను ఏర్పాటు చేసి పక్కా భవనాలను నిర్మించింది. రెండు దశాబ్దాల తర్వాత వెనకకు తిరిగి చూస్తే ఆశించిన ఫలితాలు రాకపోగా విద్యా నాణ్యత ప్రమాణాలు మరింతగా దిగజారి పోయాయి. ఆ కాలంలో ప్రారంభించిన పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కారణంగా అప్పుడు ప్రభుత్వంలో వున్న పార్టీ నాయకులను కాంట్రాక్టర్లుగా తయ్యారు చేయడానికి, వారి జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడింది. పాఠశాలల ఏర్పాటులో చూపిన శ్రద్ధను మౌళిక వసతులు కల్పించడంలోను, నాణ్యమైన విద్యను అందించడంలోను ప్రభుత్వం చూపలేదు.మారిన పరిస్థితుల కారణంగా విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేరు. ఇద్దరు ఉన్నచోట మౌళిక వసతులు లేవు. ఈ పాఠశాలల నిర్వహణను ప్రభుత్వాలు తలకు మించిన భారంగానే భావిస్తున్నాయి. మరోప్రక్క ప్రైవేట్-కార్పోరేట్ విద్యా సంస్థలు విస్తరించిన కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు లేరన్న కారణంతో కొన్ని పాఠశాలలను శాశ్వతంగా మూసివేసి అక్కడి విద్యార్ధులను, ఉపాధ్యాయులను దగ్గరలోని వేరొక పాఠశాలలో సర్దుబాటు చేయడం ద్వారా మెరుగైన విద్యను అందించవచ్చు, ఖర్చును తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ తీరును ఉపాధ్యాయ-విద్యార్ధి సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హేతుబద్దీకరణతో పాఠశాల విద్యావ్యస్థ బాగు పడుతుందనుకోవడం కూడా ఒక భ్రమ మాత్రమే.ముందు చూపులేని ప్రభుత్వాలు-ఉన్నతాధికారులు “లేడికి లేచిందె పరుగు” అన్నట్లు ఒకప్పుడు పాఠశాలల విస్తరణను చేపట్టి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అంతే వేగంతో హేతుబద్దీకరణకు పూనుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం అన్వేషించడం లేదు. చర్చా-విశ్లేషణ, సంవాదం – సమన్వయం లేకుండా చేపట్టే ఏ కార్యాక్రమాలైన/పథకాలైన ఇలాగే కొనసాగి ఆచరణలో విఫలం అవుతాయి. విస్తరణ లేదా హేతుబద్దీకరణ ముఖ్యం కాదు. అందరికి సమానమైన, నాణ్యమైన విద్యా అందుతుందా లేదా అనేది ముఖ్యం. విస్తరణ, హేతుబద్దీకరణ రెండు ఆనాలోచిత అసంబద్ధమైన విధాన నిర్ణయాలే. పుండోకటైతే మందొకటి వేసినట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది.విస్తరణ, హేతుబద్ధీకరణతో విద్యావ్యస్థలో ఏండ్ల తరబడి ఉన్న మౌలిక సమస్యలు తీరవు.పాఠశాలల విస్తరణ పేరుతో 30 ఏండ్లు కాలం గడిపిన ప్రభుత్వాలు, హేతుబద్ధీకరణ పేరుతో మరో 30 ఏండ్లు కాలం వెల్లబుచ్చాలని ప్రయత్నిస్తున్నాయి. క్రమ క్రమంగా పాఠశాలల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం ద్వారా ప్రభుత్వాలు ఖర్చును తగించుకోవాలని, బాధ్యతల నుండి తప్పకోవాలని చూస్తున్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయోనన్న భయంతో విద్యార్థులు-వారి తల్లిదండ్రులు అయోమయ (సంకట) స్థితిలో నలిగిపోతూ, నష్టపోతున్నారు. వివిధ వర్గాల ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు తాత్కాలికంగా వెనక్కు తగ్గినప్పటికి చాప కింద నీరు లాగ హేతుబద్దీకరణ అమలుకు పూనుకుంటుంది.విద్యా వ్యవస్థలో నెలకొన్న మౌళిక సమస్యలను, అనుబంధ సమస్యలను చర్చించి, పరిష్కరించకుండా “మాయల గారడి చేతిలో మంత్రదండం” లాగా హేతు బద్దీకరణను చూపడం, హేతుబద్ధీకరణ ఒక్కటే విద్యా వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా చూపడం ప్రభుత్వాల అవివేకానికి, అసమర్ధతకు నిదర్శనం. ఒక పాఠశాలను తీసి మరో పాఠశాలలో కలిపితే, వచ్చే ఫలితం సన్యాసి సన్యాసి రుద్దుకుంటే బూడిద రాలినట్లు గా ఉంటుంది. మొత్తం విద్యా వ్యవస్థలోనే అంతరాలు, అసమానతలు బలంగా ఉన్నప్పుడు ఒక పాఠశాలను మరోక పాఠశాలలో కలపడంలో ఉపయోగం ఏమి ఉండదు. లోప బూయిష్టమైన వ్యవస్థను మార్చకుండా పాఠశాలల విలీనంతో ప్రయోజనం శూన్యం. పాఠశాలల విస్తరణతో విద్యా వ్యవస్థ ఏమాత్రం మెరుగు పడలేదు. ఫలితాలు, ప్రమాణమాలు మరింతగా దిగజారిపోయాయి. విలీనంతో ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశించడం కూడా పొరపాటే. విలీనంతో విద్యా వ్యస్థలో దిగజారుతున్న ఫలితాల పరిణామ క్రమం తగ్గకపోగా, పెరిగిపోయే ప్రమాదం ఉంది. విస్తరణ-విలీనం (హేతుబద్దీకరణ) ను ప్రక్కన పెట్టి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఆలోచించాలి. సామాజిక, విద్యావేత్తల, మేధావుల, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించాలి. విద్యా వ్యవస్థలో ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని మౌలిక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. సమాజ నిర్మాణంలో ప్రధాన రంగాలైన విద్యా – వైద్య రంగాలను జాతీయం చెయడమే ఏకైక పరిష్కారం.