ప్రజల తప్ప నాయకుల తప్ప..?
నాయకుల మీద ప్రజలకు పెరుగుతున్న అసంతృప్తి
టికెట్ వచ్చే వరకు ఒక పార్టీ…గెలిచాక ఇంకొక పార్టీ…
పరకాల,నేటిధాత్రి
రాజకీయాల్లో విలువలు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు రోజురోజుకీ బలంగా వినిపిస్తున్నాయి.ఎన్నికల ముందు ఒక పార్టీ జెండా ఎగరేస్తూ,ఆ పార్టీ సిద్ధాంతాలపై ప్రసంగాలు చేసే నాయకులు,టికెట్ రాకపోతే వెంటనే మరో పార్టీలో చేరడం సాధారణమైపోయింది.ప్రజల ముందర సేవాభావం అంటూ చెప్పుకునే నాయకులు,పదవి కోసం మాత్రం సిద్ధాంతాలను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది.ఎన్నికల సమయంలో “మా పార్టీ మా ప్రాణం”అంటూ హామీలు ఇస్తూ,ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన పార్టీలోకి చేరడం కొత్త సంస్కృతిగా మారుతోంది.ఇది ప్రజాస్వామ్యానికి మేలా?
లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటు వేసే సమయంలో ప్రజలు పార్టీ సిద్ధాంతాలను,
అభ్యర్థి నిబద్ధతను విశ్వసించి తమ తీర్పు ఇస్తారు.కానీ ఆ విశ్వాసం నిలబెట్టుకోవాల్సిన నాయకులే
పార్టీ మార్పులతో ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నారు.టికెట్ రాకపోతే అసంతృప్తి,టికెట్ రాగానే ఆనందోత్సాహాలు,
గెలిచాక మరో పార్టీ వైపు చూపు ఇది రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిందనే భావన ప్రజల్లో కలుగుతోంది.సాధారణ కార్యకర్తలు సంవత్సరాల పాటు కష్టపడితే,అంతిమంగా అవకాశాలు మాత్రం ఆఖరి నిమిషంలో చేరిన వారికే దక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.పార్టీల్లో కష్టపడిన వారిని పక్కనబెట్టి,
వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రాధాన్యం ఇవ్వడం అసంతృప్తికి దారి తీస్తోంది.ప్రజలు మాత్రం అభివృద్ధి,పారదర్శకత,
స్థిరత్వం కోరుకుంటున్నారు.కానీ నాయకుల పార్టీ మార్పులు
ఆ ఆశలను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికల సమయంలో ఒక మాట,
ఎన్నికల తర్వాత మరో మాట ఇది రాజకీయ నైతికతకు విరుద్ధమా అనే చర్చలు జరుగుతున్నాయి.ప్రజల ఓటు విలువను కాపాడాల్సిన బాధ్యత
ఎన్నికైన ప్రతినిధులపై ఉంది.
అయితే పదవుల కోసం పార్టీ మార్పులు
ఆ బాధ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.ప్రజలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.ఎవరు నిజంగా సేవాభావంతో ఉన్నారు?ఎవరు కేవలం అవకాశవాదులే? అన్నది గమనిజంచే పనిలో ఉంటున్నారు.రాజకీయాల్లో స్థిరత్వం,సిద్ధాంతాలకు కట్టుబాటు,ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం
ఇవే ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులని చెప్పవచ్చు.ప్రజలు మారాలని కొందరు అంటున్నారు.
నాయకులు మారాలని మరికొందరు అంటున్నారు.అయితే నిజమైన మార్పు
నాయకుల నిబద్ధతలో కనిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.పార్టీ మార్పులు కాదు,ప్రజా సేవే ముఖ్యమని నిరూపించగలిగినప్పుడు మాత్రమే
నాయకులపై విశ్వాసం మరింత బలపడుతుంది.అంతవరకు ఈ ప్రశ్న మాత్రం వినిపిస్తూనే ఉంటుంది.
