దడ పుట్టిస్తున్న పసిడి! చరిత్రలో తొలిసారిగా 5.5 ట్రిలియన్ డాలర్ల హెచ్చుతగ్గులు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల మేర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కమోడిటీ మార్కెట్స్లో నెలకొన్న ఒత్తిడికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా బంగారం, వెండి ధరలపై చర్చే! సామాన్యుల నుంచి బడా ఇన్వెస్టర్లు, వ్యవస్థాగత మదుపర్ల వరకూ అన్ని వర్గాల వారినీ పసిడి ధరల పరుగు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏ రోజు ధర ఎంత పెరుగుతుందో? ఎంత తగ్గుతుందో? అసలు పసిడిపై పెట్టుబడికి ఇది సరైన సమయమో కాదో తెలియక సామాన్యుల తలకిందులవుతున్నారు. అయితే, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గురువారం బంగారం మార్కెట్ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైందని స్టాక్ మార్కెట్ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది.ది కొబేసీ లెటర్’ చేసిన ట్వీట్ ప్రకారం, గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 గంటల మధ్య (అమెరికా కాలమానం ప్రకారం) బంగారం మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్లను చేరింది. నిత్యం హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ మార్కెట్ విలువ 850 బిలియన్ డాలర్లే. కానీ బంగారం మార్కెట్ విలువలో ఇంట్రాడే హెచ్చుతగ్గులే ఇందుకు మూడు రెట్లు ఉండటం కలకలానికి దారితీస్తోంది.
