రాజకీయ కక్షతోనే నాపై అక్రమ కేసులు
సూదిని అజయ్రెడ్డి పెత్తనం కోసం కుట్రలు పన్నుతున్నారు
మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్
నర్సంపేట,నేటిధాత్రి:
రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెన్నారావుపేట మాజీ ఎంపీపీ జక్క అశోక్ యాదవ్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి వద్ద అనుచరుడిగా చలామణి అవుతున్న సూదిని అజయ్రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం మండలంలో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.మండలంలోని కాంట్రాక్టు పనుల్లో తన పెత్తనం కొనసాగించేందుకు, తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పెద్ద నాయకులుగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే తన బంధువైన ఏసీపీ రవీందర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ రెడ్డిలపై ఒత్తిడి తీసుకువచ్చి తనపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు.నెల రోజుల క్రితం జల్లి గ్రామంలో కేవలం ‘క్వార్టర్ మందు’ కోసం జరిగిన చిన్నపాటి గొడవను అడ్డుపెట్టుకొని తనను కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని జక్క అశోక్ యాదవ్ పేర్కొన్నారు. గొడవ జరిగిన రోజు గానీ, విచారణ జరిగిన రోజు గానీ తాను గ్రామంలో లేనని తెలిపారు. బాధితులు పోలీస్స్టేషన్ వద్ద నిరసన తెలిపిన సమయంలో కూడా తాను మండల పరిధిలో లేనని స్పష్టం చేశారు.తనకు కనీస సంబంధం లేకపోయినా, రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేసుల్లో తన పేరును చేర్చారని ఆరోపించారు.సూదిని అజయ్రెడ్డి తన అక్రమ సంపాదన కోసం ఎమ్మెల్యే వద్ద ఎవరినైనా దొంగలుగా చిత్రీకరించగలరని, చివరకు సొంత అన్నదమ్ములను కూడా దూరం చేయగల వ్యక్తి అని ఘాటుగా విమర్శించారు.జల్లి గ్రామంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి సూదిని అజయ్రెడ్డే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై ఏసీపీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి, అక్రమ కేసుల నుంచి తన పేరును తొలగించాలని జక్క అశోక్ యాదవ్ డిమాండ్ చేశారు.
