రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. భారత్కు ఐరోపా నుంచి వినతుల వెల్లువ
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్కు చేరుకోనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత పుతిన్కు ఇది తొలి భారత పర్యటన. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఐరోపా దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను పురస్కరించుకుని ఐరోపా దేశాలు భారత్ సాయం కోసం తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (Putin India Tour).
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాళ్లల్లో ఐరోపా దేశాలు భారత్పై అనేక ఒత్తిళ్లు తెచ్చాయి. రష్యా తీరును ఖండించాలని డిమాండ్ చేశాయి. రష్యాతో భారత్ తన బంధాన్ని తెంచుకోవాలని కూడా ఆశించాయి. ఏదో పక్షానికి మద్దతుగా ఉండాలని వివిధ దేశాల ప్రతినిధులు భారత్పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పుతిన్ ఎంతకీ లొంగకపోవడంతో ఐరోపా దేశాలు రూటు మార్చుకున్నాయి. భారత్ జోక్యంతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించేందుకు తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అయితే, భారత్ మాత్రం తటస్థ వైఖరినే కొనసాగించింది. యుద్ధాలు చేసే కాలం ముగిసిందని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ ఇదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం.
భారత్, రష్యాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి పాతికేళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక 2010లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా గుర్తించడంతో దౌత్య బంధం మరింత బలోపేతమైంది.
