ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో పారిశుధ్యంపై పాలకుల నిర్లక్ష్యం…

ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో పారిశుధ్యంపై పాలకుల నిర్లక్ష్యం
ఆలయంలోకి అడుగుపెట్టే ముందు అసహ్యంతో కళ్లుమూసుకోవాల్సి వస్తే???
వ్యర్ధాల జంక్షన్ ఇచ్చారు పూర్తిగా మూయడం మర్చిపోయారు??
మలమూత్రాధులతో దుర్గంధం వెదజల్లుతున్న దక్షిణం గేట్
అశుద్దాలను దాటుకొంటూనే ఆలయంలోకి భక్తులు, బోనాలు
కళ్ళకి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పారిశుధ్య నిర్వహణ లోపం
లక్షలు వెచ్చించామన్నారు లక్షణంగా విఫలమయ్యారు??

నేటి ధాత్రి అయినవోలు

 

భక్తుల విశ్వాసానికి నిలయమైన ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం తీవ్ర పారిశుధ్య లోపాలతో అపహాస్యానికి గురవుతోంది. లక్షలాది భక్తులు తరలివచ్చే ఈ ఆలయంలో కనీస పరిశుభ్రతను కూడా కాపాడలేని పరిస్థితి నెలకొంది. అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన వ్యర్థాల జంక్షన్‌ను పూర్తిగా మూయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారు. ఫలితంగా అక్కడి నుంచి వెలువడుతున్న దుర్వాసన భక్తులను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. ముఖ్యంగా దక్షిణం గేట్ వద్ద మలమూత్రాల దుర్గంధం వ్యాపించి, ఆ ప్రాంతం గుండా ఆలయంలోకి ప్రవేశించాల్సిన భక్తులు అసహనంతో ముఖం తిప్పుకునే పరిస్థితి ఏర్పడింది.పవిత్ర భావంతో బోనాలు మోసుకొచ్చే భక్తులు అశుద్ధాల మధ్యగా నడిచి ఆలయంలోకి ప్రవేశించాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. ఇది కేవలం అశ్రద్ధ కాదు, భక్తుల మనోభావాలను గాయపరిచే చర్యగా భావించాల్సిందే. “ఇదేనా దేవాలయ పాలన?” అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.పారిశుధ్య నిర్వహణకు లక్షలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెప్పుకుంటున్నప్పటికీ, ఆ ఖర్చుల ఫలితం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కాగితాల మీద ఉన్న పారిశుధ్య నిర్వహణ, భూమిపై మాత్రం శూన్యమే. మాటలకే పరిమితమైన సమీక్షలు, ఫోటోలకే పరిమితమైన పర్యటనలు తప్ప, వాస్తవ పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. చెప్పే మాటలకు, కనిపించే పరిస్థితులకు మధ్య పొంతన లేకుండా పోయింది. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత లోపం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో అధికారుల మాటలు నమ్మశక్యంగా లేకుండా పోతున్నాయి.ఇలాంటి నిర్లక్ష్యం కొనసాగితే ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగడమే కాకుండా, భక్తుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా అసంతృప్తి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

కేతకిలో….. ఇష్టరాజ్యం….!

కేతకిలో….. ఇష్టరాజ్యం….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీ కేతకీ సంగమేశ్వర దేవాలయం ఝారాసంగం లో ఇటీవల జరిగిన అవ్యవస్థలు భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. నవంబర్ 16, 2025న ఆలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తులు నిర్వాహకుల నిర్లక్ష్యం, అనుచిత వ్యవహారం, నియమ నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆలయంలో జరుగుతున్న అభిషేక కార్యక్రమానికి అనుమతి లేని వ్యక్తులను లోపలికి అనుమతించడం, భక్తులను బయట వేచి ఉండేలా చేసి అసౌకర్యానికి గురిచేయడం, గర్భగుడి వద్ద అనవసర రద్దీ నెలకొనడం వంటి అంశాలు బయటపడ్డాయి. విఐపి దర్శనాల పేరుతో సాధారణ భక్తులను నిర్లక్ష్యం చేయడం పట్ల కూడా భక్తుల్లో ఆగ్రహం చెలరేగింది.ఈ మొత్తం వ్యవహారంపై 126వ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ అధికారికంగా దేవాదాయ శాఖకు ఫిర్యాదు అందజేశారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలు ఏవీ భరించబోమని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఆలయ నిర్వహణ జరగడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

◆ రుద్ర అశోక్ ఫిర్యాదులో—

◆ అభిషేక సమయాల్లో నియమాలు పాటించకపోవడం,

◆ గర్భగుడి వద్ద అనుచిత రద్దీ,

◆ అధికారుల పర్యవేక్షణ లోపం,

◆ భక్తులకు అగౌరవం,

◆ వంటి అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు.

ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యత ఉన్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖను ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ మర్యాదలను కాపాడడం దేవాదాయ శాఖ ప్రధాన బాధ్యత అని రుద్ర అశోక్ స్పష్టం చేశారు.
భక్తులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దేవాలయ నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version