నాలుగో తేదీన జరిగే సిపిఐ బహిరంగ సభను విజయవంతం చేయండి- కసిరెడ్డి సురేందర్ రెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా ఈనెల నాలుగో తేదీన కరీంనగర్ నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బహిరంగ సభ కరపత్రాన్ని సిపిఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేశారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం, పెట్టుబడి దారి విధానానికి వర్గ దోపిడీకి, శ్రమ దోపిడీకి, వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రచారోద్యమాలు నిర్వహించటానికి 1925 డిసెంబర్ 26వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో సిపిఐ కరీంనగర్ లో బహిరంగ సభ రెవెన్యూ గార్డెన్ లో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి చేయడం కోసం జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ పాల్గొని ఎన్నో కేసులను ఎదుర్కొని జైల్లో నిర్బంధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ప్యూడల్ వ్యవస్థను బద్దలు కొట్టేందుకు వందేళ్లుగా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం సర్కార్ ను గద్దెదించడానికి దేస్
ముఖులు, రజాకార్ లను ఎదిరించటానికి వెట్టి చాకిరి విముక్తి కోసం భూమికోసం భుక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఐ అగ్రభాగాన నిలిచిందని ఆమహత్తర పోరాటానికి రావి నారాయణరెడ్డి, మగ్దూo మోహినుద్దీన్, బద్ధం
ఎల్లారెడ్డిలు ముగ్గురు పిలుపునిచ్చారని అందులో బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్ జిల్లాకి చెందినవారు కావడం గర్వించదగ్గ విషయమని, ఆ పోరాటంలో నలభై ఐదు వందల మందికి పైగా కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మూడు వేలకు పైగా గ్రామాలను విముక్తి చేయబడ్డాయని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దేనిని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిపిఐ ముందుండి పోరాడిందని జాతీయస్థాయిలో ఒకే నినాదంతో ప్రజల ఆలోచనలను, ఆకాంక్షలను గ్రామస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు వినిపించి రాష్ట్రo సాధించేవరకు అనేక పోరాటాలు ఉద్యమాలు, యాత్రలు, పోరు బాటలు నిర్వహించిన పార్టీ కేవలం సిపిఐ పార్టీయేనని అన్నారు. వందేళ్ల ఉత్సవాల సందర్భంగా రెవెన్యూ గార్డెన్లో బహిరంగ సభ జరుగుతుందని దీని విజయవంతం కోసం జిల్లాలోని పార్టీ శ్రేణులు సానుభూతిపరులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈబహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈసమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, నగర కార్యవర్గ సభ్యులు ఎలిశెట్టి భారతి, గామినేని సత్యం, చెంచల మురళి, మాడిశెట్టి అరవింద్, భాకం అంజన్న, బెక్కంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
