మాదకద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
మండల స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ పై సమావేశాలు నిర్వహించాలి
గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి
డ్రగ్స్ నియంత్రణ పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాలు (డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం వారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర అధికారులతో కలిసి నిర్వహించారు.
జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పాఠశాలలో పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు.
పాఠశాలలు మరియు కళాశాలలు పునఃప్రారంభం జరిగిన తర్వాత డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఉన్న బార్, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు.
జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇట్టుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వీటిలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు.
డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సెస్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యారోగశాఖ అధికారికి సూచించారు.
కళాశాలలో సడన్ గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు.
డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ సెక్షన్ సూపర్డెంట్ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలీ బేగం, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, ఎక్సైజ్ విద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.