యర్కారం హత్య కేసులో వేగంగా దర్యాప్తు..
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట, నేటి ధాత్రి :
మండలం పరిధిలోని యర్కారం గ్రామంలో బిఅర్ ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సంఘటన స్థలాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మృతుడు చింతలపాటి మధు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా ఆయన భార్య మరియు కుమార్తెను పరామర్శించి ధైర్యం చెప్పారు. కేసులో నిందితులను త్వరితగతిన గుర్తించి వెంటనే అరెస్ట్ చేస్తామని బాధిత కుటుంబానికి ఎస్పీ హామీ ఇచ్చారు.
ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కాగా చింతలపాటి మధు హత్య ఘటనతో యర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
