*కీలపట్లలో శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారం..
*అంతరాయం లేకుండా త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా..
*గృహ అవసరాలతో పాటు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం…
*రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్..
గంగవరం(నేటి ధాత్రి) మే05:
గంగవరం మండలంలోని కీలపట్ల పంచాయతీ పరిధిలో విద్యుత్ సమస్య శాశ్వతంగా పరిష్కారానికి నోచుకుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. కీలపట్లలోని కోనేటి రాయస్వామి ఆలయంలో స్వామి వారిని ఆదివారం ఆయన దర్శించుకుని పంచాయతీ కేంద్రంలో రూ.60 లక్షల ఆర్డీఎస్ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన నాలుగు 100 కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల తో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కీలపట్ల గ్రామంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్బంగా చేపట్టే ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో విద్యుత్ తీగల కారణంగా ఇబ్బందులు ఉండేవన్నారు. గ్రామస్తులు మరియు భక్తుల శ్రేయస్సు దృష్ట్యా 60 లక్షలతో గ్రామంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు 100కేవి ట్రాన్స్ ఫా
ర్మర్లను మరియు సమస్య అనేదే ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అదనంగా 25 కేవి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ను సైతం ఏర్పాటు చేశామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండడమే కాకుండా లో ఓల్టేజి సమస్య అనే మాటే ఉండదన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజల అవసరాలకే గాక 24 గంటలు త్రీఫేస్ విద్యుత్ ను వాడుకోనేందుకు వీలుందన్నారు. దాంతో పాటు పంచాయతీ పరిధిలో చిన్న పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు. అతి తక్కువ సమయంలో ఆర్డీఎస్ కాంట్రాక్టర్ లు మరియు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఈ పనులను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. కీలపట్ల పంచాయతీ పరిధిలో ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకోవడం, రోడ్లు,గృహాలు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి గా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఈఈ శ్రీనివాస మూర్తి, ఏడి చిన్నబ్బ, కన్స్ట్రక్షన్ ఏడి రెడ్డి కుమార్, ఏఈ రామక్రిష్ణ, మరియు టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ చంద్ర శేఖర్, వేణు, గిరిధర్ గోపాల్, రాము,శీనప్ప, శ్రీనివాసులు, జనసేన నాయకులు చంద్ర తదితరులున్నారు..