ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
మృతుడి కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి
ఈ ఘటనపై నైతిక భాద్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
బిఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా ప్రభుత్వ మొండివైఖరికి పట్ల మనస్థాపంతో నర్సంపేట ఆర్టీసీ బస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలోని ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం ముత్తోజిపేటలో శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళర్పించారు. మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో ఉంచి నివాళి అర్పించడానికి ఆర్టీసీ కార్మికులకు అవకాశం ఇవ్వాలని పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్ది మాట్లాడుతూ, ఆర్టీసీ డ్రైవర్ మృతికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. మృతుడి కుటుంబానికి ఆర్టీసీ జెఏసి నాయకులు నివాళులు అర్పించకుండా ఎక్కడి అక్కడ పోలీస్ పహారతో అడ్డుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.ఈఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ విషాద ఘటన అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి నల్గొండ జిల్లా తీసుకెళ్లారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
