-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి.
-కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది.
-అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది.
-ప్రజా సమస్యలు చర్చించడం లేదు.
-ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం.
-మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి.
-సోషల్ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి.
-మీడియా, సోషల్ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి.
-రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి.
-ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే!
-ప్రతి అంశంలోనూ కప్పగంతులే.
-గెలిచిన పార్టీలు అంతా బాగుందనుకుంటున్నాయి.
-ఓడిన పార్టీలు గెలిచేందుకు తాపత్రయపడుతున్నాయి.
-అన్ని పార్టీలు కలిసి ప్రజా సమస్యలను గంగలో ముంచేస్తున్నాయి.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాను రాను రాజకీయాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గత యాభైఏళ్ల రాజకీయాలకు ఇప్పటికీ పొంతన లేకుండాపోతున్నాయి. ఒకప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి, నిత్యం ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజలు ఆదరించేవారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులనే ఆదరించేవారు. ఏ పార్టీ అయినా నిరంతరం పోరాటంలో వుంటేనే అదికారంలోకి తెచ్చేవారు. అది కేంద్రంలోనైనా రాష్ట్రాలలోనైనా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసేవారు. కాని కాలం మారింది. మరీ ఈ రెండు దశాబ్ధాల కాలంలో నాయకులకు మాటలొస్తే చాలు. అబద్దాలు చెప్పడం వస్తే చాలు. నమ్మించడం తెలిస్తే చాలు. అవసరమైతే ప్రజలను సెంటిమెంటుతో ఒప్పిస్తేలు చాలు. కులం, మతం ఆసరాగా చేసుకొని రాజకీయాలుచేస్తే చాలు. ప్రజల్లో వున్న నమ్మకాలను పట్టుకొని రాజకీయాలు చేస్తేచాలు. అన్నట్లు తయారైపోయాయి. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేదు. సిద్దాంతాలు పట్టుకుంటే రాజకీయాలు సాగే రోజులు కాదు. అందుకే ఇప్పుడు రాజకీయాలకు సిద్దాంతాలు లేవు. పార్టీలు ఏనాడో రూపొందించుకున్న విలువలు లేవు. అందుకే సమాజంలో ఎవరు నాయకులౌతున్నారో? ఎవరు గెలుస్తున్నారో? ఎందుకు గెలుస్తున్నారో? కూడ అర్దంకాని పరిస్ధితులు ఎదురౌతున్నాయి. రాజకీయాలు చేయడాన్ని కూడా తమదైన శైలిలో నడిపించేవారికే రాజకీయ భవిష్యత్తులుంటాయి. నాయకులకు వ్యతిరేకంగా వున్న పార్టీలపై కూడా ప్రజలు కోపం పెంచుకుంటున్నారు. నాయకులకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో లేవు. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ దేశ వ్యాప్త రాజకీయాలను ఒక గ్రంధంగా మార్చొచ్చు. రామాయణం కన్నా పెద్ద కావ్యం రావొచ్చు. అయితే ఇక్కడ ఆటలో అరటిపండ్లు ప్రజలే అవుతున్నారు. ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజలే ఎనుకున్న ప్రజా ప్రభుత్వం. ఇది పేరుకే అన్నది ఇప్పటి కాలం నిజం చేస్తోంది. కొన్ని నిజాలు చాలా చేదుగా, ఘాటుగా కూడా వుంటాయి. 2014లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి బిజేపి పెద్దగా కష్టపడలేదు. కాని ఆ అదికారాన్ని వరసుగా మూడు సార్లు నిలబెట్టుకోవడానికి మాత్రం చేస్తున్న రాజకీయ విన్యాసం విచిత్రమైనది. ప్రజా సంక్షేమం గతంలో ఎప్పుడూ లేనంతగా చూపిస్తూ బిజేపి కేంద్రంలో తిరుగులేని పాలన కొనసాగిస్తుందా? అంటే ఔనని సమాదానం ఎంత మంది చెబుతారో మాత్రం చెప్పలేం. కాని బిజేపి పార్టీ మూలసిద్దాంతంలో ఒకటైన మతాన్నిమాత్రం గట్టిగా పట్టుకున్నది. హిందూ మతానికి ప్రమాదం వుందన్న భయాన్ని ప్రజల్లో రేకిత్తెంచగలిగింది. హిందూ సమాజాన్ని మాత్రం ఏకం చేయడంలో బిజేపి సక్సెస్ అయ్యింది. అదే కొనసాగిస్తూనే వుంది. అటు తిరిగి, ఇటు తిరిగి హిందూ పునరేకీకరణ అనేదే మూలసిద్దాంతమైపోయింది. అంతకు మించి ఏం చేస్తోంది అంటే చెప్పడానికి ఏదీ లేదు. కాని దేశం మాత్రం సుబిక్షంగానే వుంది. కరువు లేదు. ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేదు. కాని నిరుద్యోగం విపరీతంగా పెగిపోయింది. దేశంలో సాగు వెనుకబడిపోయింది. అయినా సమృద్దికరమైన ఆహారమే జనానికి అందుతోంది. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది అర్ధాకలితో బతుకుతున్నారు. ఆ వార్త మాత్రం ఎక్కడా కనిపించదు. వినిపించదు. ఆకలి కేకులున్నట్లు ఒక్క మీడియా రాయదు. ఇదే ఇప్పుడున్న రాజకీయాల్లో బెస్ట్ క్వాలిటీ. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే ఏ ఒక్క జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మానం చేసింది లేదు. రాష్ట్రాలలో కూడా ఏపి, తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు నిర్మాణం చేసినట్లు వార్తలు లేవు. ప్రశ్నించే నాయకులను కులం మీద దెబ్బకొట్టాలి. మతాన్ని ముడిపెట్టి రాజకీయాలు చేయాలి. బిజేపిని ప్రశ్నించే ప్రతి వారిని హిందూ వ్యతిరేకులని నిందించాలి. దేశ ద్రోహులని ముద్రలు వేయాలి. ఇలా ఇప్పటి వరకు మూడుసార్లు అధికారంలోకి కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా అధికారం దక్కించుకునేందుకు బిజేపి ఆడుతున్న రాజక్రీడలో ఎవరూ ఎదురు నిలబడి గెలవడం లేదు. 130 సంవత్సరాల చరిత్ర వున్న కాంగ్రెస్కూడా కాకావికలమైపోతోంది. బిజేపి డౌవర్ట్ పాలిటిక్స్ను మాత్రమే నమ్ముకొని రాజకీయాలు సాగిస్తోంది. కేంద్రం నుంచి గుజరాత్కు,ఉత్తరాదికి నిధులు ఎన్ని వెళ్తున్నా, కనీసం బిజేపి నాయకులు కూడా నోరెత్తలేని రాజకీయాలు రచిస్తోంది. కొనసాగిస్తోంది. ధరలు ఆశాకాశన్నంటుతున్నా ఎవరూ అడిగే పరిస్దితి లేదు. పక్క దేశాల కయ్యాలే రాజకీయంగా కాపాడుతాయన్నయని నమ్ముకుంటున్నారు. రాష్ట్రాలలో కూడా అదే పరిస్దితి. 2014 ఎన్నికల్లో బిఆర్ఎస్ చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్ని కావు. కాని అమలుచేసినవి కూడా పెద్దగా ఏమీ లేదు. కాని ఓట్ల రాజకీయంలో కొన్ని కీలకమైన అంశాలు జొప్పించి రాజకీయం కేసిఆర్ సాగించారు. నీళ్లను పట్టుకున్నాడు. ఆ విషయంలో పదేళ్ల కాలంలో చేయాల్సినంత చేశాడు. మిగత వాటిని వదిలేశాడు. అందుకే పదేళ్ల తర్వాత జనం కూడా కేసిఆర్ను వదిలేశారు. జనం కేసిఆర్ను కాదనుకుంటున్నారన్న సంగతి గ్రహించిన రేవంత్రెడ్డి తన రాజకీయం తాను మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు ఊహలకందని ఎత్తులు వేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులు నోరు మూయించాడు. వారందిరినీ తన బాటలోకి తెచ్చుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో అమలు జరుతున్న కొత్త పథకాలు అంటే గ్యారెంటీ కార్డుకే పరిమితం చేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించింది. అప్పుడు కేసిఆర్ కాంగ్రెస్ హమీలను కూడా కలుపుకొని ప్రచారం చేసుకున్నాడు. విజయం సాదించాడు. కాని 2023 ఎన్నికల్లోనూ ఆరు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల తర్వాత కేసిఆర్ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినా అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. కాని 2023 ఎన్నికల్లో సిఎం. రేవంత్ మొదటి దెబ్బ అక్కడి నుంచే మొదలు పెట్టారు. పదేళ్లు పాలించి, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసిఆర్ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టాడంటూ బలంగా రేవంత్రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా గమనించేలా చేశారు. కేసిఆర్ చెప్పే మాటలు మోసమని నమ్మించగలిగారు. కాంగ్రెస్ ఒక్కసారి మాటిస్తే మర్చిపోయేది లేదని చెప్పారు. మోసం చేయడం కాంగ్రెస్ చరిత్రలోనే లేదన్నారు. ఒక్కొసారి కాస్తా ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని జనాన్ని నమ్మించారు. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇస్తాం..అని చెప్పడం మొదలు పెట్టారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఇలా చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని గ్యారెంటీ రూపంలో ప్రజలకు చేర్చారు. కార్డులు చేతిలో పెట్టారు. గెలిచారు. ఆ వెంటనే ఆట మొదలు పెట్టారు. జనాన్ని ఆరు గ్యారెంటీలు మర్చిపోయేలా చేయాలంటే బిఆర్ఎస్ నాయకుల నోరు మూయిస్తే చాలనుకున్నారు. సిఎం. రేవంత్ రెడ్డి తన సరికొత్త రాజకీయాన్ని సాగిస్తున్నారు. ఆఖరుకు ప్రతిపక్ష బిజేపి కూడ కాంగ్రెస్ను కాకుండా బిఆర్ఎస్నే టార్గెట్ చేసే రాజకీయాలు చేస్తున్నారు. సహజంగా అదికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కాని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి రెండూ బిఆర్ఎస్ను పుడ్ బాల్ ఆడేస్తున్నాయి. బిఆర్ఎస్ నోరు తెరవకుండా చేస్తున్నాయి. వీటినే డైవర్ట్ పాలిటిక్స్ అంటారు. కాళేశ్వరం పై కమీషన్ వేశారు. అది జీడిపాకంలా సాగుతూనే వుంది. గత 18 నెలులగా జనంలోనానుతూనే వుంది. దానికి ఇప్పుడే అంతం వుండదు. ఇంకా సాగదీస్తూనే వుంటారు. జనం ఎప్పుడూ మాట్లాడుకోవడానికి ఏదో ఒక సమస్య వుండాలి. అందులోనూ బిఆర్ఎస్ నాయకులు దోషులని జనం ఎప్పుడూ నమ్ముతూ వుండాలి. అలా కేసిఆర్ మీద కాళేశ్వరం, కేటిఆర్ మీద కార్లరేస్ కేసు, కవిత మీద లిక్కర్ కేసు ఇలా ప్రతి నిత్యం ఇవే అంశాలు చర్చలకు రావాలి. మీడియాలో ఇవే అంశాలపై చర్చల మీద చర్చలు జరగాలి. ప్రజా సమస్యలు తెరమీదకు రాకూడదు. తాజాగా బనకచర్ల తెరమీదకు వచ్చింది. ఇదెంత కాలం సాగుతుందో…ఎవరి రాజకీయాలకు చుట్టుకుంటుందో చూడాలి. రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్రజలు అంత అమాయకులు కాదు. దేనిని నమ్మాలో..దేనిని నమ్మొద్దో తెలియని వాళ్లు కాదు. కాని అప్పుడప్పుడు రాజకీయాలలో ప్రజలు కూడా బోల్తాపడతారు. తర్వాత మళ్లీ తేరుకుంటారు. అయిన ఇప్పుడున్న పరిస్దితుల్లో రాజకీయ పార్టీలు మాత్రం డైవర్ట్ పాలిటిక్స్నే నమ్ముకున్నారు. పక్కన ఏపిలో కూడా ఇదే అమలు చేస్తున్నారు.