జల, వర, ‘‘సర్వ ప్రదాయని’’ కాళేశ్వరం!

-అన్నింటికీ నీళ్లే ఆధారం..

-కాళేశ్వరాన్ని వదిలేస్తే కరువు ఖాయం!

-మళ్ళీ తెలంగాణ ఎడారి కావడం తధ్యం.

-తెలంగాణ వలసల రాష్ట్ర కావడం పెద్ద దూరంలో లేదు.

-ప్రగతి అంటే ప్రజల బతుకులు బాగుపడాలి.

-ఎకానమీ వృద్ధితో ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి.

-ప్రజల సంపన్నులు కావాలని ప్రభుత్వాలు కోరుకోవాలి.

-ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఖజానా లెక్కలు చూసుకోకూడదు.

-ప్రజలు సంపన్నులుగా మారే ప్రణాళికలు అమలు చేయాలి.

-కాళేశ్వరం అలాంటి గొప్ప దిక్సూచికి నిదర్శనం.

-తెలంగాణ రెండు రకాల ఆదాయ వనరులు మీద ఆధారపడి వుంది.

-ఆ రెండు రంగాలు నీటి అవసరాలతో ముడిపడి వుంది.

-వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ తెలంగాణకు అవసరం.

-పారిశ్రామిక ప్రగతి, పట్టణీకరణకు నీరు ఎంతో అవసరం.

-ప్రజలకు సాగు, త్రాగుకే కాదు నిర్మాణ రంగానికి నీరు ప్రధానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాళేశ్వరం నిజంగా తెలంగాణకు వరప్రదాయినే..అరవై ఏళ్ల తెలంగాణ గోసను తీర్చిందే. ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించిదే. అన్నమో రామ చంద్రా అని ఏడ్చిన తెలంగాణ అన్న పూర్ణగా మార్చిందే..వెయ్యి అడుగులకు బోర్లు చేసినా చుక్క నీరందని తెలంగాణలో, పది ఫీట్లలోనే నీరందించిన వర ప్రదాయినే..నలభై ఏళ్ల క్రితం పూడిపోయిన బావుల్లో కూడా నీరు చేసింది కాళేశ్వరం వల్లనే…నలభై ఏళ్లుగా వినియోగించని బావులు మళ్లీ సాగుకు పనికొచ్చాయంటే కారణం కాళేశ్వరమే…పాతాళంలో వున్న నీరును తెచ్చి సాగు చేసేందుకు వేసిన బోర్లు కరంటు అసవరం లేకుండా ఎల్లబోసినవి కాళేశ్వరం వల్లనే..అవును ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా వుండడానికి కారణం కాళేశ్వరమే… కాళేశ్వరం ఎప్పుడూ శనేశ్వరం కాదు. తెలంగాణకు పట్టిన శనిని తరిమిన అదృష్టమే కాళేశ్వరం. సరిగ్గా పన్నెండేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లపాటు కరవులో మగ్గిన తెలంగాణ ప్రాంతం. కరువు అంటే అలాంటి ఇలాంటి కరువు కాదు. భయంకరమైన కరువు. నీళ్లు లేకనా..కాదు..వానలు కురవకనా? లేదు. అన్నీ వున్నాయి. కాని తెలంగాణ నెత్తిన ఉమ్మడి పాలన అనే శని వచ్చి కూర్చన్నది. ఏలి నాటి శనికైనా కొంత కాలం వుంటుందేమో? కాని ఉమ్మడి పాలన శని 60 ఏళ్లు పట్టి తెలంగాణను పీడిరచింది. ఉమ్మడి పాలన మొదలైన నాటి నుంచే తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. రెండు రాష్ట్రాలు కలిసి నాటి నుంచే కొట్లాట మొదలైంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆరాటం, పోరాటం రెండూ మొదలయ్యాయి. కాని కనికరించిన వారు లేదు. కదిలిన వారు లేరు. తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేస్తుంటే పట్టించుకున్న పెద్దలు లేరు. డిల్లీ నేతలకు తెలంగాణ అన్యాయం కనిపించనంగా ఉమ్మడిపాలకులు మాయ చేసి, మభ్యపెడుతూ వచ్చారు. పాలకులుగా ముందుండి తెలంగాణ నేతలను వెనక్కి నెట్టేశారు. బలం లేనితెలంగాణ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను బలం చూసుకొని సీమాంద్ర నాయకులు పెత్తనం చేశారు. తెలంగాణ నిధులను ఆంద్రాకు ఎత్తుకెళ్లారు. తెలంగాణ నీళ్లను మలుపుకెళ్లారు. ఆఖరుకు తెలంగాణకు పని లేకుండా, ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోయారు. తెలంగాణను ఎండబెట్టారు. లేని కరువును తెచ్చి రుద్దారు. కనికరం లేనిపాలన సాగించారు. తెలంగాణ గోస పుచ్చుకున్నారు. గొంతెండుతున్న తెలంగాణను చూసి నవ్వుకున్నారు. తెలంగాణకు కష్టం తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మెతుకులు విదిల్చినట్లు ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు శంకుస్ధాపనలుచేసేవారు. ఆకాశంలో చుక్కలు చూపించి, ఓట్లు వేయించుకునేవారు. ఎప్పుడూ ఇదే తరీక..ఎన్నికలు అయిపోగానే మళ్లీ మెలిక. ఇదే ఉమ్మడి పాలకులు చేసిన మోసం..ద్రోహం..దౌర్జన్యం..ఆదిప్యతం. తలాపున పారుతున్న గోదావరి నీటిని తెలంగాణకు మళ్లిస్తే ఎండాకాలంలో ఆంద్రాకు చుక్క రాకుండాపోతుందనుకున్నారు. ఆంద్రాలో రెండో పంటకు నీళ్లివ్వాలంటే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు. తెలంగాణలో వున్న ప్రాజెక్టుల నీళ్లు కూడా పొలాలకు అందించలేదు. ఆంద్రాలో రెండో పండలకు అవసరమైనప్పుడు మాత్రం గెట్లెత్తుకున్నారు. శ్రీరాం సాగర్‌ నిర్మాణం నుంచి మొదలు, తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా, అది ఆంద్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఎగువన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి మొదలు కింద కిన్నెర సాని వరకు ఏపికి ఉపయోగ పడే ప్రాజెక్టులుగానే మార్చుకున్నారు. తెలంగాణకు చుక్కనీరించేందుకు మనసు రాలేదు. మిగులు జలాల కాలవలు ఆంద్రాకే, వరద జలాల కాలువలు ఆంద్రాకే ఇలా గోదావరి గలగల పారుతున్న సవ్వడి తప్ప, నీటిచుక్కను ఇవ్వలేదు. ఆఖరుకు సమ్మక్క సారక్క జాతర సమయంలో కూడా నీళ్లు వదిలేందుకు కూడా ఇష్టపడకపోయేవారు. ఇక కృష్ణా నది నీటిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని చెప్పేవారు. పాలమూరును ఏనాడు పట్టించుకోలేదు. కాని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనే పొక్కపెట్టి పోతిరెడ్డి పాడుపేరుతో వెనుక నుంచి వెనక్కే మళ్లించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో కుడిలో ఏడాదంతా నీళ్లు తీసుకెళ్లారు. ఎడమ కాలువకు అడగంగ అడగంగా అరకొర వదిలేవారు. పైగా కుడి కాలువ నుంచి ఏపి రైతులకు, కృష్ణాడెల్టాకు ఉచితంగా నీళ్లిచ్చేవారు. ఎడమ కాలువకు నీటి తీరువా వసూలు చేసేవారు. కుడికాలువపై వున్న ఎత్తిపోతల ఖర్చు ప్రభుత్వం భరించేది. ఎడమ కాలువ ఎత్తిపోతల ఖర్చు రైతుల నుంచి వసూలు చేసేది. ఇంతటి దుర్మార్గమైన పాలననుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాళేశ్వరం వచ్చింది. తెలంగాణ సాగుకు నీరుండేది కాదు. భూ గర్భ జలాలకు దిక్కులేదు. వర్షాకాలం కురిసే వానలకు కూడా పంటలు పండిరది లేదు. బావులు నిండేవి కాదు. బాగా కాలమైనా మూడు నెలలకు మించి నీరు సాగుకు సరిపోయేది కాదు. బోర్లు వేసుకున్నా నీరు రాక తెలంగాణ రైతులు అప్పుల పాలైపోయేవారు. ఆ అప్పులు తీర్చేందుకు కూలీలుగా మారిన దుస్తితి చూసింది తెలంగాణ. అలాంటి తెలంగాణ రూపు రేఖలు మార్చింది కేసిఆర్‌. ముమ్మాటికీ ప్రతి తెలంగాణ వాది ఒప్పుకోవాల్సిందే. పార్టీలకతీతంగా కాళేశ్వరం అంశంలో గొప్పగా చెప్పుకోవాల్సిందే. దురదృష్టమేమిటంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. నిజాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ పాలకులు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగితే బైట పెట్టడం తప్పు కాదు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని ఏ తెలంగాణ వాది కోరుకోవడం లేదు. కాని ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ఎండబెట్టడం సరైంది కాదు. కాళేశ్వరం మీద వేసిన కమీషన్‌ కూడా దాని నిర్మాణ సమయంత సాగ దీయడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. కాళేశ్వరంలో జరిగిందని రేవంత్‌ సర్కారు కమీషన్‌ వేసినప్పుడు ప్రజలు స్వాగతించారు. కాని కాళేశ్వరం నీటిని వినియోగం ఆపడం నుంచి ప్రజల్లో ఒకింత బిఆర్‌ఎస్‌పై సానుభూతి పెరుగుతోంది. రానున్న కాలంలో అది మరింత పెరిగే అవకాశంవుంది. ఆ తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్ధితి రాదు. కమీషన్‌ రిపోర్టు అందుకు అనుగుణంగా వచ్చినా ప్రజలు స్వాగతించరు. ఎందుకంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ లబ్దిపొందింది. రైతులు సంతోషంగా వున్నారు. గత ఏడాది విసృతంగా వానలు కురిశాయి. సమృద్దిగా రైతులకు నీరందింది. దానితో కాళేశ్వరంతో పని లేకుండా పంటలు పండాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే అది నిజమని ప్రజలు కూడా నమ్మారు. కాని గత సీజన్‌లో రైతులకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు కాలం కూడా ముఖం చాటేస్తుంది. ఇలాంటి పరిస్దితులు వస్తే, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, పంటలు ఎండిపోకుండా చూసుకోవడం కోసం నీళ్లను ఆదా చేసి, రైతులకు ఇచ్చేందుకే కాళేశ్వరం అని ప్రజలు గుర్తించే రోజు వస్తోంది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్దితి. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే అప్పటి బిఆర్‌ఎస్‌ పాలకుడు, కేసిఆర్‌ సుస్పష్టంగా చెప్పారు. మూడేళ్లు కాలం కాకపోయినా, కరువు వచ్చినా, తెలంగాణ రైతు నీళ్లకు ఇబ్బందులు ఎదురుకావని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నిజం కానున్నది. జూలై నెల వస్తున్నా వాన చినుకు జాడ లేదు. వర్షాలు ఇప్పుడు కురుస్తాయన్న సంకేతాలు కూడ కనిపించడం లేదు. ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఓ వైపు రైతులు సాగు మొదలు పెట్టారు. గతంలో పదేళ్లపాటు కాలం కోసం ప్రజలు ఎదురుచూడలేదు. అటు దేవాదుల, ఇటు కాళేశ్వరంతో పుష్కలంగా భూ గర్బ జలాలు వున్నాయి. హైదరాబాద్‌ కు కూడా మంచి నీటి కటకట రాలేదు. పారిశ్రమలకు నీరు అందలేదన్న మాట వినిపించలేదు. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే, ఆగష్టులో అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదరుకాకతప్పదు. ఇప్పుడు చెరువులు నింపాలన్నా, దేవాదులలో నీరు లేదు. ఇతర రిజర్వాయర్లలలో సమృద్దిగా నీరు లేదు. చెరువులుఎక్కడిక్కడ ఎండిపోయాయి. దీని ప్రభావం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద పడుతుంది. రైతు కన్నెర్ర చేస్తే ఇక కనికరించే పరిస్ధితి వుండకపోవచ్చు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడిపాలకులు అన్యాయంచేశారు. కాళేశ్వరం వున్నా నీటిని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం బద్‌నాం కాకతప్పదు. కాళేశ్వరంలో కుంగిన మూడు పిల్లర్లను బాగుచేస్తే బిఆర్‌ఎస్‌కు పేరొస్తుందని అనుకోవడం తగదు. కరవొచ్చి ఒక్క మడి ఎండినా, అది కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి నాంది జరుగుతుంది. కాంగ్రెస్‌ మరో పది కాలాల పాటు పాలించాలనుకుంటే, ప్రభుత్వం కొనసాగాలంటే నీటి సంక్షోభం లేకుంటే చూసుకుంటే మంచిది. లేకుంటే కాంగ్రెస్‌ చే జేతులా గడ్డు కాలం తెచ్చుకున్నట్లౌవుంది. బిఆర్‌ఎస్‌ను మరిపించేలా నీరివ్వండి. కాంగ్రెస్‌ను మళ్లీ మళ్లీ గెలిపించుకునేలా చేసుకోండి. రైతుకు నీళ్లందితే కాంగ్రెస్‌కు మేలు. రైతు ఏడిస్తే ఇదే కాంగ్రెస్‌కు గెలుపు ఆఖరు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version