అవినీతిపై ఉక్కుపాదం!

https://epaper.netidhatri.com/view/279/netidhathri-e-paper-29th-may-2024%09/2

`అవినీతి రహిత తెలంగాణ నిర్మాణం.

`ఆదర్శ తెలంగాణ కోసం సంకల్పం.

`అవినీతి అధికారులను ఏరిపడేస్తోంది!

`గతంలో ఎంత మంది మీద ఆరోణలు వచ్చినా పట్టించుకోలేదు.

`ఎన్ని విజిలెన్స్‌ ఎంక్వైరీలు జరిగినా చర్యలు తీసుకోలేదు.

`ఉద్యోగుల విచ్చలవిడి తనాన్ని ఆపలేదు.

`అందుకే అవినీతి విపరీతంగా పెరిగింది!

`ఇప్పుడు ఏక కాలంలో ఏరివేత జరుగుతోంది

`వివిధ శాఖలపై దృష్టి సారించిన రేవంత్‌ సర్కార్‌

`అవినీతి అధికారుల భరతం.

`ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు హోటళ్లపై దాడులు.

`అనేక మంది నకిలీ వైద్యుల గుర్తింపు.

`తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు.

`హడలెత్తిపోతున్న అక్రమార్కులు.

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:

అవినీతి ఒక వైరస్‌ లాంటిది. అది సమాజాన్ని పట్టి పీడిస్తూనేవుంటుంది. ఏ వైరస్‌కైనా మందుంది కాదు. అవినీతి అనే వైరస్‌కు మాత్రం ఇప్పటికి వరకు మందు లేదు. దాన్ని ఆపిన వారు లేరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతూనే వుంది. సమాజంలో అవినీతి రాజ్యమేలుతూనే వుంది. అయినా ఏ ఒక్కరూ ఆపింది లేదు. ఏ ఎన్నిక జరిగినా, ఏపార్టీ అయినా సరే ముందు చెప్పే మొదటి మాట అవినీతి అంతం. ఇదే మాట దేశంలో జరిగే పంచాయితి ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల దాక చెబుతూనే వుంటారు. ప్రజలు వింటూనే వుంటారు. ఆ ప్రభుత్వంలో అవినీతిని చూస్తూనే వుంటాం. ప్రచారంలో, మ్యానిఫెస్టోలో ప్రతిసారి రాజకీయ పార్టీలు అవినీతిని ఒక అంశంగా చేర్చి అవినీతిని అంతం చేస్తాం. అవినీతి రహిత సమాజం నిర్మాణం చేస్తామంటూ చెప్పని వారు లేరు. అంతే కాదు ప్రభుత్వంలోకి వచ్చిన తొలిరోజు కూడా ప్రతి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పే ఏకైక మాట కూడా ఇ దే. మరి అవినీతి ఆగిందా? ఎవరూ సమాధానం చెప్పలేరు. ప్రధాన మంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే…ఇలాంటి పరిస్దితుల్లో పాలకులు చెప్పడం, జనం వినడం పరిపాటిగానే మారింది. కాని మొదటి సారి తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ చెప్పినది చెప్పినట్లుగా అవినీతి అంతం మొదలు పెట్టింది. గతంలో ఎవరూ ఇలా మొదలు పెట్టింది లేదు. అవినీతి ఆపే ప్రయత్నం చేయలేదు.

మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినది చెప్పినట్లుగా అవినీతి రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

అందుకు పక్కా కార్యాచరణ తీసుకున్నట్లున్నారు. అందుకే ఏక కాలంలో అవినీతి అదికారులను ఏరిపడేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ సర్కారులో గాని ఏనాడు జరగలేదు. ఉద్యోగులు చేసిన అవినీతిపై కేసిఆర్‌ సర్కారు ఏనాడు కదల్లేదు. అంతే కాదు పిర్యాదు దారులకే నష్టం జరిగిందే గాని, అవినీతి చేసిన అదికారులకు మరింత మేలు జరిగింది. పిల్లలకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే టీచర్లను జీవో.317 తెచ్చి చెల్లా చెదరు చేశాడు. నిజానికి టీచర్లకు ఎలాంటి ఇతర ఆదాయ మార్గాలువుండవు. వాళ్లు తమ గ్రామంలోనో, పక్కనే వున్న పట్టణంలోనో మాత్రమే వుంటారు. జిల్లా దాటి వెళ్తే వారి జీతానికి, జీవితానికి పొంతన లేకుండాపోతుంది. అలాంటి గురువులను సొంత జిల్లాల్లో వుంచకుండా, ఇష్టం వచ్చినట్లు విసిరేసిన కేసిఆర్‌ సర్కారు, ఇతర శాఖల ఉద్యోగులను మాత్రం నెత్తిన పెట్టుకున్నది. తెలంగాణ రాక ముందు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడి నుంచి పదేళ్ల పాటు కదలించకుండా కొలువులు చేయనిచ్చారు. దాంతో అలా పాతుకుపోయిన అదికారులు చేసిన అరాచాలు అంతా ఇంతా కాదు. వారి సంపాదనకు లెక్కే లేదు. మండలస్ధాయి ఉన్నతాధికారి కూడా కోట్లకు పడగలెత్తారు. ఇక ఆపై ఉద్యోగులు ఎంత సంపాదించారన్నదానిపై లెక్కలు తీసే లెక్కించేందుకు మిషన్లు చాలవన్నంతగా సంపాదించారు. కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాదికారులు ఏకంగా రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలవుదామనుకున్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్దపడ్డారు. మరి వాళ్లందరికీ అంతంత సొమ్ము ఎలా కూడిరది? కేవలం జీతాల మీద ఆదారపడే ఉద్యోగులకు పదేళ్ల కాలంలో వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? వందల కోట్ల సంపాదన ఎలా సమకూరింది? ఇలాంటి వాటికి ఎవరు సమాధానం చెప్పాలి. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చింది. అవినీతి వ్యవసాయం చేస్తోంది. చేనులో చీడ పీడలను ఏరిపారేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి అదికారులను గుర్తిస్తున్నారు. ఏసిబితో వారిని పట్టుకుంటున్నారు. వారి బండారం బైటపెడుతున్నారు. వారి ఆస్దులను లెక్కిస్తున్నారు. వారిని జైలుపాలు చేస్తున్నారు. అయినా కొంత మంది జైలు నుంచి బైటకు వచ్చి మళ్లీ కొలువు కోసం పైరవీలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఇంత తక్కువ కాలంలో ఇంత మంది అవినీతి అదికారులను పట్టుకోవడం అంటే ప్రజల మీద రేవంత్‌రెడ్డికి ఎంత ప్రేమ వుందో అర్దం చేసుకోవచ్చు.

ప్రజలకు మేలు ఎంత మేర చేయొచ్చని ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలో కూడా అవినీతిని అంతం చేస్తామని చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పారు. కాని ఎవరూ ఒక్క అడుగు కూడా వేయలేదు. కాని రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వ వ్యవస్దలే కాదు, ప్రైవేటు వ్యవస్దలలో కూడా అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. అక్రమార్కులు ఎక్కడ వున్నా, ఏ వ్యాపార రూపంలోవున్నా వారిని పట్టుకుంటున్నారు. అందుకే ప్రజల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై ఏక కాలంలో దాడులు చేసి, పెద్దఎత్తున వాటిని మూసేస్తున్నారంటే ప్రజల జీవితాల మీద రేవంత్‌రెడ్డికి వున్న చిత్తశుద్దిని ఇక్కడే గమనించవచ్చు. పేరుకు పెద్ద పెద్ద హోటళ్లు , విసృతమైన ప్రచారాలు, అందమైన భవనాలు, ఇతర హోటళ్లకన్నా ఎక్కువ ధరలు వసూలు చేస్తూ, రోడ్ల మీద కూడా అంత నాసిరకం ఆహార పదార్దాలు వుండని హోటళ్ల బండారం బైట పెడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి భరతం పడుతున్నారు. ఇదిలా వుంటే వైద్య వ్యవస్దను కూడా అక్రమార్కులు చేరి, ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నారో తెలిసిపోయింది. గత పదేళ్ల కాలంలో ఏనాడు బిఆర్‌ఎస్‌ సర్కారు నకిలీ వైద్యుల గురించిగాని, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రుల మీద గాని నిఘా పెట్టలేదు. వారి గురించి ఆరా తీయలేదు. వారిని పూర్తిగా విచారించలేదు. జిల్లా వైద్యాధికారులు అడిరది ఆట, పాడిరది పాటగా మార్చుకొని విచ్చలవిడిగా ఆసుపత్రులకు పర్మిషన్లు ఇచ్చారు. ఆ సర్టిపికెట్లు ఒరిజినలా? లేక డూప్లికేటా? కూడా చూడకుండా ఆసుపత్రుల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. దాంతో కనీసం పది కూడా చదవని వారు ఎంబిబిఎస్‌ బోర్డులు పెట్టుకొని వైద్యం చేస్తుంటే గత పాలకులు చోద్యం చూశారు.

నకిలీ శంకర్‌దాదాలు ఎక్కడో మారు మూల ప్రాంతాలలో ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోలేదు.

దర్జాగా హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసుకొని, వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి అలాంటి దొంగ డాక్టర్ల బాగోతాలు కూడా వెలుగులోకి తెస్తున్నారు. ఇక తెలంగాణ మొత్తం దాడులు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ఇలా వుండాలి. ప్రజా పాలకుడు అంటే రేవంత్‌రెడ్డిలాగ వుండాలని ఆదర్శమౌతున్నారు. నిజంగా తెలంగాణలో ఇలాంటి అక్రమార్కులు లేకుండా చేస్తే రేవంత్‌ పాలన చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్‌ కీర్తి ఆచంద్ర తారార్కం వెలుగుతుంది. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒక్కటే..మెరుగైన పాలన. అంటే ప్రజలకు ఎలాంటి కల్తీ లేని ఆహారపదార్దాలు ప్రజలకు అందాలి. తక్కువలో మెరుగైన వైద్యం అందాలి. అధికారుల నుంచి పనులు వెంటనే ఉచితంగా పూర్తి కావాలి. అసలు ప్రభుత్వాధికారులు వున్నదే ప్రజల సేవ కోసం. వారితో పని చేయించుకోవడం ప్రజల హక్కు. కాని ప్రజల నుంచి ముక్కు పిండి పనిని బట్టి వసూలుచేసుకోవడం హక్కుగా అదికారులు మార్చుకున్నారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సీరియస్‌గా అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నా లంచాలు తీసుకోవడం అధికారులు మానడం లేదు. అంటే లంచాలకు ఎంతగా అలవాటు పడ్డారో తెలుస్తోంది. లంచం కూడా అదికారులకు ఒక వ్యసనంగా మారినట్లు వుంది. లంచం లేకుండా ఇంటికి వెళ్లలేని పరిస్దితి వచ్చినట్లుంది. అందుకే ఎలాంటి భయం లేకుండా దర్జాగా లంచాలు తీసుకుంటున్నారు. పట్టుబడుతున్నారు. అయినా వారిలో ఎలాంటి భాద కనిపించడంలేదు. ఎందుకంటే మళ్లీ ఆ కుర్చీలోకి వస్తామన్న నమ్మకం పెరిగిపోయింది. గతంలో ఇలా పట్టుబడ్డ వాళ్లెంతోమంది మళ్లీ కొలువులు చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో పట్టుబడిన డిప్యూటీ తహసిల్దార్‌ 2017లో కూడ రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మరి మళ్లీ ఎలా కొలువులో చేరాడు. అలా చేరడం పెద్ద సమస్య కాలేదు. అందుకే మళ్లీ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అంత దర్జాగా లంచం తీసుకుంటున్నారు. ఇలా ఒక్కసారి పట్టుబడిన అదికారుల కొలువులు తొలగిస్తేగాని వారిలో మార్పు రాదు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version