గుట్ట లోగుట్టు తేల్చుతారా?

https://epaper.netidhatri.com/

భక్తిరంజిత గుట్టనే మింగిరే!

`రేవంత్‌ రెడ్డి ఆనాడు అక్రమమనెనే!

`దాసోజు కూడా బాగానే కొట్లాడెనే?

`విజయారెడ్డి కేసు నమోదు చెసెనే!

`అయినా కోవెల కూలెనే!

`దేవుడు కొండ దిగెనే?

`అనాధగా ఓ మూలన నిలబడెనే!

`దేవుని గుడి చెదిరే..భవంతులు వెలసెనే!

`స్థలం స్వాధీనం చేసుకుంటారా?

`గుట్ట మింగిన ఘనులకు వదిలేస్తారా?

`బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తారా?

`ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండలాంటి ప్రదేశం. సమాచారం మేరకు సుమారు పద్నాలుగు ఎకరాల నిర్మానుష్యమైన, అరుదైన ఆయుర్వేద మూలికలు కలిగివున్న ప్రాంతం. అభయాంజనేయ స్వామి కొలువైన వున్న స్ధలం. జాతీయ పక్షి నెమళ్లు నడయాడుతూ, నాట్యమాడే ఆహ్లాదరకమైన వాతావరణం. జీవ వైవిద్యానికి నిదర్శనం. ఏటా వేలాదిమంది హనుమాన్‌ భుక్తులు మాల ధారణతో ఆ కోవెలను నమ్ముకొని అంజన్నను కొలిచే ధ్యాన లోకం. అయితేనేం గత ప్రభుత్వం కొందరు వ్యక్తులకు అప్పనంగా కట్టుబెట్టింది. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారులు చెప్పిన దానికి తలూపింది. మన మనిషే కదా? అని అంతా దోచిపెట్టింది. ఇవ్వాల్సిన దానికి లెక్కలేదు. ఇచ్చిన దానికి తెక్కలేదు. ఆక్రమించుకున్నదానికి లెక్కే లేదన్నట్లు కొండను అప్పనంగా కట్టబెట్టారు. ఆ వెంటనే వాళ్లు ఆ కొండను పిండి చేశారు. అక్కడ గుట్ట ఆనావాలు లేకుండా చేశారు. అసలు ఇచ్చిన భూమి ఎంత అంటే అధికారులు చెప్పరు? తీసుకున్నదెంత అని చెప్పడానికి ఎవరూ అందుబాటులో వుండరు. కాని అధికారులు దగ్గరుండి అందించింది కొండంత. ఇదే సందన్నట్లు ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అనుకున్నాడు. గుట్టే కాదు, ఆ గుట్టముందూ, వెనకవున్న భూమిని కూడా స్వాహా చేశారు. గుట్టమీద కొలువై వున్న అంజన్నను కూడా పక్కకు పొమ్మన్నారు. పాపం దేవుడు తన గోడు ఎవరికీ చెప్పుకోలేక అప్పటి నుంచి మౌన వ్రతం చేస్తున్నాడు.
కొండలెక్కినా దేవుడా ..ఆ బండలలో ఏముంది?
నువు చేసిన లోకం చూడు…అని భక్తులు పాటలు పడుతుంటే, దేవుడు ఆ పాటలు వింటుంటే, ఆ ఏమరపాటులో కొండలు కొట్టేస్తున్న ఘనులున్నారు. కొండలు, గుట్టులు మింగేస్తున్నారు. దేవున్ని నిజంగానే కొండ దించేస్తున్నారు. దేవుడికి ఆ కాస్త చోటు కూడా లేకుండా చేస్తున్నారు. ఆస్ధులు, అంతస్ధులు కావాలి దేవుడా వరాలియ్యవా? అని మొక్కుల మీద మొక్కులు మొక్కాలి. తదాస్తు అనగానే దేవుడు కొలువై వున్న కొండలనే దోచేయాలి. దేవుడా అని వేడుకున్న నోటితోనే అడ్డుగా వున్న కోవెల కూల్చేయమనాలి. వ్యాపారం చేయాలి. కొండలు తవ్వి అంతస్ధులు నిర్మించాలి. ఆ దేవుణ్ణి అనాదను చేయాలి. లోకాన్ని కాపాడే దేవుడికే శఠగోపం పెట్టాలి. పైకి బొట్టు, బోనం, భక్తి ముసుగు చూపించాలి. కాలం కలిసి రాగానే దేవుణ్ణి కూడా దూరంగా తరిమేయాలి. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? హైదరాబాద్‌లోనే… జూబ్లీహిల్స్‌లోనే…
సరిగ్గా రెండేళ్లుగా నేటిధాత్రి దినపత్రిక గుట్ట`గుడి అంటూ నెత్తి, నోరు కొట్టుకొని ఎంత మొత్తుకున్నా, గుట్టను ఎవరూ కాపాడలేదు.
గుడిని మింగేకుండా అడ్డుకోలేదు. ఈ సంగతి ఆనాటి పాలకులకు తెలుసు. ఆనాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. గుట్టను కూల్చితే ఊరుకోం..ప్రభుత్వ స్ధలం దారాధత్తంచేస్తే సహించమని చెప్పిన రేవంత్‌రెడ్డి నాడు ఎంతో కంఠశోషతో చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టిన వైనంపై లోతైన తవ్వకాలు జరగాలి. ఆనాడు ప్రభుత్వం గుట్టను కూల్చిన వ్యక్తులకు కట్టబెట్టింది ఎంత? అధికారులు దోచిపెట్టింది ఎంత? అసలు అక్కడున్న ప్రభుత్వ స్ధలమెంత? ఇప్పుడు ఆ స్ధల యజమానులుగా చెప్పుకుంటున్నవారు అక్రమంగా ఆక్రమించింది ఎంత? అందులో ముడుపులు ముట్టిందెంత? పుచ్చుకున్నదెంత? వాళ్లెంతమంది అన్నది కూడా తేలాలి.
అది జూబ్లీహిల్స్‌ ప్రాంతం. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం.
కొందరి కన్ను పడిరది. ప్రభుత్వం వారికి రుణ పడి వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరమైంది. అందులోనూ గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా వున్న వ్యక్తికి అప్పనంగా గుట్టను కట్టబెట్టింది. అసలు ఈ విషయం తెలిసిన నేటి ధాత్రి మొదటి రోజు నుంచి జరుగుతున్న మోసాన్ని వివరిస్తూనే వున్నది. విన్నవారంతా ఆ వ్యక్తికి రాత్రికి రాత్రి చీకటి బంధవులౌయ్యారు. గుట్టను కాపాడుతామన్నవారు, మరునాడు మాయమౌతున్నారు. మేమున్నామంటూ వచ్చి చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఆ తర్వాత మౌనం పాటించారు. అంతే కాదు గుట్ట..గుడిని కాపాడేది మేమే అంటూ కొంత మంది స్వాములు కూడా ఆ సమయంలో బయలు దేరారు. యాగాలు, యజ్ఞాలు చేశారు. టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. లోగుట్టు పెరుమాళు కెరుక అన్నట్లు స్వాములు కూడా సైలెంటుగా పక్కకు వెళ్లిపోయారు. అక్కడ బహుళ అంతస్ధులు సముదాయాలు నిర్మాణం చేస్తున్నవారికి సరెండరైపోయారు. ఈ విషయంపై వరుస కధనాలు రాసిన నేటిధాత్రి వార్తలను చూసిన స్వాములే బెదించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని గుంటూరు స్వాములెందుకొచ్చారు? గుట్ట కాపాడే ముసుగెందుకేసుకున్నారు? నేటిధాత్రిని ఎందుకు బెదిరించారు? ఇప్పటీ అర్ధం కాని శేష ప్రశ్నలివి. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నేటిధాత్రి కధనాలను ఆపలేదు. గుట్ట, గుడి కథ రాష్ట్రంలో పెద్ద వార్త దావానలంగా మారింది. ఆరెస్సెస్‌ రంగలోకి దిగింది. భజరంగ్‌ ధళ్‌ ధర్నా చేసింది. బిజేపి మేమున్నామని అన్నది. స్ధానిక ఎమ్మెల్యే స్పందించాడు. స్వాహా పర్వమంతా బిఆర్‌ఎస్‌నేతదే అని తెలిసి తనకు అందాల్సింది తీసుకొని వెళ్లిపోయాడు? నగర బిజేపి ఏకైక ఎమ్మెల్యే నేనున్నాడన్నాడు. నాటి పిపిసి. అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేక సార్లు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం ఆ స్ధలం తిరిగి తీసుకునేదాకా వదిలిపెట్టమని ఆనాడు రేవంత్‌ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ గుట్టను స్వాహా చేయడాన్ని అడ్డుకుంటామన్నాడు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో వున్న నేటి బిఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అనేక సార్లు గుట్ట గుడి వివాదంలో వేలు పెట్టాడు. ఆనాటి ప్రభుత్వాన్ని తూర్పార పట్టాడు. అన్యాయమని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, నిజా నిజాలు వెల్లడిరచారు. ఈ విషయంలోనే దాసోజు కాంగ్రెస్‌నుంచి బైటకు వెళ్లాడన్న వార్తలు కూడా ఆనాడు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరాడు. సైలెంటు అయ్యాడు. గుట్ట వ్యవహారం మర్చిపోయాడు.
అసలు అక్కడ గుడే లేదని కూడా సదరు నాయకుడి వ్యాపార భాగాస్వాములు రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టారు.
దాన్ని నేటిధాత్రి పూర్తి స్ధాయి ఆధారాలు ప్రచురించింది. జూబ్లిహిల్స్‌ కార్పోరేటర్‌ విజయారెడ్డి కూడా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి నేటిధాత్రి తెచ్చింది. ఈ గుట్టమీద కన్ను పడిన సదరు వ్యాపారులే గతంలో ఓసారి గుడిని కూల్చే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఏకంగా అంజన్న విగ్రహాన్ని కూడా ద్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సంగతి విజయారెడ్డి దృష్టికి రావడంతో అంజన్న విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె పిర్యాదు చేశారు. అయితే దేవాదాయ శాఖ అప్పటికీ స్ధలాన్ని స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఎందుకంటే గుడి కూల్చిన తర్వాత నేటిధాత్రి దేవాదాయ శాఖను కూడా ప్రశ్నించడం జరిగింది. దేవాదాయశాఖ అధికారులను కూడా కమ్మేసినట్టు సమాచారం. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్ధాయి అదికారులు, రెవిన్యూ యంత్రాంగం భరితెగించి, అప్పటి బడా నాయకుడికి సహకరించారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా గుట్టను తిరిగి ఫ్రభుత్వం స్వాధీనం చేయలేదు. దేవాదాయా శాఖకు అప్పగించలేదు. విచిత్రమేమిటంటే అదే జూబ్లీహిల్స్‌లో ప్రైవేటు స్ధలాన్ని కొంత మంది సినీ గద్దలకు పెట్టి, అక్కడ గుడి కట్టేందుకు సహకరించి మరింత స్ధలం ఇచ్చారు. ఆ పక్కనే గుడి వున్న గుట్టను ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడికి కట్టబెట్టి, గుట్టనే లేకుండా చేశారు. గుడిని మాయం చేశారు. అభయాంజనేయ స్వామికే శఠగోపం పెట్టారు..ఇదండీ సంగతి…మరి ప్రభుత్వం మేలుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తారా? లేక మాదాకా సమాచారం లేదని చేతులు దులుపుకుంటారో చూడాలి…ఎందుకంటే గుట్ట గుడి సంగతులు రాస్తే రామాయణమంతా వున్నాయి?

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version