* వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నిర్ణయం
హైదరాబాద్:- రాష్ట్రంలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుజేఐ) నిర్ణయించింది. పాత్రికేయుల సంక్షేమం కోసం భారతీయమజ్జూర్ సంఘ్కు అనుబంధంగా ఏర్పాటై జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న డబ్ల్యూజేఐ ఆధ్వర్యంలో పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ లు హాజరై ప్రసంగించారు. పాత్రికేయుల సమస్యలపై పోరాడుతున్న డబ్ల్యూజేఐకు తాము అండగా ఉంటామని ప్రకటించారు.
సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ మాట్లాడుతూ డబ్ల్యూజేఐ అన్నిజిల్లాలకు విస్తరించాలని సూచించారు. నిరంతరం కార్యక్రమాలు చేపట్టాలని , బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ డబ్ల్యూజేఐకు అండగా ఉండటం సంతోషదాయకమన్నారు. జాతీయ స్థాయిలో పాత్రికేయుల సమస్యలను లేవనెత్తేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
ఆత్మగౌరవంతో పోరాడుదామని, అందరి మేలు కోసం పాటుపడదామని, జాతీయ ప్రయోజనాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల విషయంలో చేయాల్సింది ఎంతో ఉందని సీనియర్ ఎడిటర్, రచయిత ఎంవీఆర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న డబ్ల్యూజేఐని అభినందించారు. డబ్ల్యూజేఐ గౌరవాధ్యక్షుడు నందనం కృపాకర్, రాష్ట్ర అధ్యక్షుడు రాణాప్రతాప్, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్ దేశాయ్, కార్యదర్శి క్రాంతి, సామాజిక కార్యకర్త తిరుమల్ పాల్గొన్నారు. కరీంనగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకులు కరుణాకర్, ప్రమోద్ కుమార్, హైదరాబాద్లోని పలువురు సీనియర్ పాత్రికేయులు, మహిళా జర్నలిస్టులు హాజరయ్యారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్నసమస్యలు, యూనియన్ విస్తరణకు ఉన్న అవకాశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.