కేతకికి శివరాత్రి వైభవం.. భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం!
◆-: కేతకీలో శివరాత్రి వైభవం
◆-: భక్తి పారవశ్యంలో దక్షిణ కాశీ..
◆-: ధర్మ దర్శనానికి 4గంటల నిరీక్షణ భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: జిల్లాలోని శైవక్షేత్రాలు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి నీలకంఠుడు పరమేశ్వరుడిని ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అష్టతీర్థాల నిలయంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర దేవాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు.
స్వామి వారి ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, మేల్కొలుపు సేవ, మహారుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించిన అనంతరం ఉదయం 1:20 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జహీరాబాద్, బీదర్ (కర్ణాటక), నారాయణఖేడ్, రాయికోడ్, ఝరాసంగం పరిసరాల గ్రామాల ప్రజలు పాదయాత్రగా దేవస్థానానికి తరలివస్తున్నారు.
ముందుగా భక్తులు స్వామివారి పుష్కరిణి అమృత గుండంలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. కేతకీ ఆలయ పరిసరాలు “ఓం నమః శివాయ” హర హర మహాదేవ అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు, దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్, ఈవో శివ రుద్రప్ప, సర్పంచ్ వినోద బాలరాజ్, దేవాదాయ ధర్మాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.A
