కాయ్ రాజా కాయ్.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్…
◆”-: బెట్టింగ్ సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న పోలీసు అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
నాడు… అగ్గిపుల్లా…. సబ్బుబిల్లా… కాదేది.. కవితకనర్హం… అన్నారు మహాకవి శ్రీశ్రీ.. నేడు.. కాదేది బెట్టింగ్కు అనర్హమంటూ…. అనతి కాలంలోనే ధనార్జనే ధ్యేయంగా కొందరు యువకులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లకు ఒడిగడుతున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్ అంటే అంతులేని మోజు… ఆట చూడడం ఒక ఎత్తైతే.. మరో కోణంలో ఆటలో గెలుపొటములపై బెట్టింగ్ల ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి కుటుంబాలను వీధికీడుస్తున్న సంఘటనలు ఉమ్మడి సంగారెడ్డి జిల్లా కాలం నుంచి ప్రస్తుత జహీరాబాద్ నియోజకవర్గ వరకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏటేటా వేసవి వినోదంగా ప్రపంచ క్రికెట్ లీగ్లకే మెగా లీగ్గా ఆవిర్భవించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు ఆరంభమవుతున్నాయంటేనే చాలు. జహీరాబాద్ ప్రాంతం లో బెట్టింగ్ ముఠాలు రహాస్యంగా రంగంలోకి దిగుతాయి. ఇలా గత అనేక సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్లు సాగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడిన వారు రాజకీయ అండదండలతో ఎలాగోలా బయటకొస్తున్నారు. మళ్లీ ఏడాది నాటికి నాడు పట్టుబడి పొగోట్టుకున్న పైకాన్ని తిరిగి రికవరీ తరహాలో సంపాదించుకుంటున్నారు. కొందరయితే ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు ఎప్పుడు ఆరంభమవుతాయా…? అంటూ ఎదురుచూస్తూ బెట్టింగ్ల కోసం పందెం కోళ్లను సిద్ధం చేసినట్లు ప్రత్యేకంగా ఈ ఆటపై ఆసక్తి… బెట్టింగ్లపై ఆశలు ఉన్న వారిని ఏరి కోరి సంసిద్ధులను చేస్తున్నారు.
భారీ మొత్తంలో పందాలు..
జహీరాబాద్ లో ఏర్పాటు తర్వాత బెట్టింగ్ బ్యాచ్ల దందాకు అంతులేకుండా పోయింది. రోజు జనంలో కలిసి తిరిగే యువకుల్లో కొందరూ బెట్టింగ్ల ద్వారా అనతికాలంలోనే లక్షల రూపాయలు సంపాదించే దొడ్డి దారి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీరికి అధికారంలో ఎవరున్నా వారి మద్దతు లభిస్తూ వస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ మార్చి 26వ తేదీ నుంచి ఆరంభమైన ఈ క్రికెట్ లీగ్లలో పెద్దపెద్ద జట్లు ఆడినప్పుడు భారీ మొత్తంలోనే పందాలు కాస్తున్నారు. శని, ఆదివారాలు వీకేండ్ రెండేసి మ్యాచ్లు ఉండడంతో ఆ రోజుల్లోనైతే పందాలకు అడ్డుఅదుపు లేదు. నేరుగా రూ.100కు రూ.1000 చొప్పున లాభాలు చూపి ఈ గేమ్లో అమాయకుల్ని దింపుతున్నారు. వందతో మొదలెట్టిన ఆట వేలు ఆపై లక్షల రూపాయలకు చేరుకుంటోంది. వివిధ చోట్ల అప్పులు చేసి మరి ఈ రొంపిలోకి దిగి కొందరు నిండా మునిగి వీధులపాలవుతున్నారు.
ఆన్లైన్ గేమ్ల్లో..
ప్రత్యక్ష పందెం ఒకటయితే ఇంకా ఆన్లైన్ గేమ్ల్లో అనేక రకాల బెట్టింగ్లు ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. రమ్మీ సర్కిల్, రమ్మీ కల్చర్, డిఫాబెట్ లాంటి ఆప్లికేషన్లు తెలంగాణలో నిషేదం ఉన్నప్పటికి ఇంకా రహాస్యంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. బెట్టింగ్ చేసే వారు ముందుగా ఒక ఐడీని క్రియేట్ చేసుకుని సదరు అప్లికేషన్లో లాగిన్ అయి తన బ్యాంకు అకౌంట్ను లింకప్ చేసుకుని డబ్బులు జమ చేసి ఆడుతున్నారని తెలుస్తోంది. ఇందులోనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, బాల్ టు బాల్, ఓవర్ టై ఓవర్, ఎకా్ట్రస్, ఫోర్, సిక్స్, వికెట్ ప్లేయిర్స్పై రకరకాల బెట్టింగ్లు కాస్తున్నారంటున్నారు.
క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటే కఠిన చర్యలు – ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభం కావడంతో, క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ మండల చారక్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదం అనే ఉచ్చులో పడి, తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఆయన యువతకు సలహా ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా కుటుంబాలు నాశనమవుతాయని, అప్పుల్లో కూరుకుపోతాయని, ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని ఎస్ఐ అన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ యాప్ల (టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్) ద్వారా పనిచేసే బెట్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. యువత, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను పర్యవేక్షించాలని, మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు తెలిస్తే, వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
యువత జీవితాలు నాశనం చేసుకోవద్దు.. ఎస్సై క్రాంతి కుమార్ పటేల్
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్, ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, దీనివల్ల అప్పుల పాలై కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ కు పాల్పడేవారిపై నిఘా ఉంచి, అక్రమాలకు పాల్పడితే పిడి యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ పేర్కొన్నారు.
