నిధులు మావి.. గొప్పలు మీవా..?
మా హయాంలోని నిధులతో శంకుస్థాపనలు చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు…
బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
నిధులు మా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు శిలాఫలకాలు వేసి శంకుస్థాపన చేస్తూ మేమే నిధులు విడుదల చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులతో 14వ వార్డులో పనులు జరిగితే వాటిని కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని, నిధులు మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించారని, ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు తీసుకురాకున్నా సరే నిధులు తీసుకొచ్చానని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. మంత్రికి మునిసిపాలిటీపై అవగాహన లేదని, ఏ నిధులు ఎక్కడ వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని ఇక మంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని ఎద్దేవా చేశారు. 14వ వార్డు సీనియర్ నాయకులు గడ్డం రాజు మాట్లాడారు.
సిసి రోడ్డు, డ్రైనేజీ, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ పనులు పూర్తయి రెండు నెలల క్రితమే ఓపెన్ చేశామని మళ్లీ శంకుస్థాపనల చేయడం చూస్తే నవ్వొస్తుంది అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరు, మంత్రి వివేక్ పద్ధతులు మార్చుకొని మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించేలా చొరవ తీసుకోవాలే తప్ప ఇలాంటి ప్రారంభించిన పనులను మళ్లీ ప్రారంభించడం విడ్డూరమని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,గడ్డం రాజు,పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,జిలకర మహేష్, అలుగుల సత్తయ్య, ఎల్లబెల్లి మూర్తి, కొండ కుమార్, యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,గాజుల చంద్రకిరణ్,వేనంక శ్రీనివాస్,నందిపేట సదానందం, పైతారి ఓదెలు, కల్వల సతీష్,శివ,మణి తదితరులు పాల్గొన్నారు.