ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ఉపాధ్యాయులుగా సంతోషించిన విద్యార్థులు ..
ఇటీవలే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని హేమలతకు సన్మానం
వేడుకలలో పాల్గొన్న మండల విద్యాధికారి కాలేరు యాదగిరి.
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మారి తమకు బోధించే గురువుల మాదిరిగానే విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రార్థనా సమయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులుగా తమ బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారిగా గట్ల మనీష్, ఎంఈఓ గా బొల్లు రిత్విక్ సాయి, ప్రధానోపాధ్యాయులుగా తుమ్మనపల్లి సుమాంజలి , ఉపాధ్యాయులుగా రావుల అక్షయ, భూక్యా స్పందన , ధరావత్ ప్రియాంక ,నాగవల్లి వర్షిని, గట్ల మనీషా ,గాజుగాని నిహారిక , లకావత్ ఇందు, బట్టి దివ్య , గుతుప స్వాతి వరుణ్ సిద్ధార్థ్ ,జాటోత్ విజయ్ కుమార్ ,అటెండర్ గా తూర్పాటి ఈశ్వర్ లు పాల్గొన్నారు.
భోజన విరామానంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాతలని , విద్యార్థులు చదువుల పట్ల మక్కువ చూపించి చదువులో రాణించాలని, తద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు హేమలతను ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుండు సురేందర్ ,వీసం నరసయ్య, వెలమాల భాస్కర్ , అప్పల నాగరాజులు పాల్గొన్నారు.