లేదంటే అక్టోబర్ 2 నుండి నిరవధిక సమ్మె
కలెక్టరేట్ ధర్నాలో జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు 34 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జేఏసీ రాష్ట్ర కమిటీలు మేరకు జిల్లా కేంద్రంలో డైట్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి భారీ ధర్నా చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 34 రోజుల సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని సమస్యలన్నీ పరిష్కరించడానికి 15 రోజులు టైం కావాలని సమ్మె విరమింప చేసి ఏ సమస్య పరిష్కరించకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు. అప్పుడు కూడా సమ్మెను జేఏసీ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని చెప్పామని ఇంతకాలం టైం ఇచ్చిన ప్రభుత్వం లో చలనం లేకుండా ఉండడంతోనే మరో పోరాటానికి కార్మికులు సిద్ధమయ్యారని అన్నారు.
కార్మికులు గొంతెమ్మ కోరికలు అడగడం లేదని నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస19వేలు వేతనాలు పెంచాలనీ, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అర్హత కలిగిన వారిని రెగ్యులర్ చేయాలని, 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని, బిల్ కలెక్టర్ కారోబార్లకు పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని మాత్రమే అడుగుతున్నారు. అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మోసం చేసినందు వల్లే కార్మికులు అక్టోబర్ 1 న చలో హైదరాబాద్ అప్పటికి స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక వినోద్ కుమార్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న,జేఏసీ జిల్లా నాయకులు పొన్న అంజయ్య, నడుకుల బిందెల నరసింహ, పి సర్వయ్య, ఎండి జహీర్, ఏర్పుల సైదులు,కె మంగారెడ్డి,ఇరిగి ఎల్లేష్, ఎరగాని లింగయ్య,ఏ కోటయ్య, సైదులు, ఎర్ర అరుణ, మరియమ్మ, హరికృష్ణ స్వామి యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.