ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.
దీంతో ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసింది.
ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప కీలక సూచన చేశారు.
వాషింగ్టన్, జూన్ 24: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటిని దయ చేసి ఉల్లంఘించవద్దని ఆయా దేశాలకు ఆయన సూచించారు. మంగళవారం ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్లోని పలు భూభాగాలపై ఇరాన్ దాడులు చేసింది. కొన్ని గంటల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం నేటితో ముగిసిందన్నారు. ఇరాన్ అన్ని కార్యకలాపాలను తొలుత నిలిపివేసిందని.. మరో 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సైతం ఆ బాటను అనుసరిస్తుందని చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా నిలిచింది. ఆ క్రమంలో ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై దాడి చేసింది. అనంతరం ఇరాన్ సైతం ఇజ్రాయెల్లోని పలు కీలక ప్రాంతాలపై దాడి చేసింది. అయితే అణుస్థావరాలపై దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని ఘాటుగా స్పందించారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేసింది. కానీ అమెరికాపై ఖమేని ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వానీ మాత్రం అమెరికతోపాటు ఇజ్రాయెల్పై మండిపడిన విషయం విదితమే. ఇరాన్కు చెందిన ఈ ఇద్దరు ఇలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పై విధంగా స్పందించారు.