దట్టంగా పెరిగిన చెట్ల పొదలు, ప్రమాదలకు నిలయంగా మారిన రహదారులు…
రోడ్డును కమ్మేసిన ముళ్లచెట్లు పట్టించుకోని అధికారులు…
దట్టమైన పొదలు తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు…
నేటి ధాత్రి -గార్ల :-
మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం నుండి సత్యనారాయణపురం రహదారి ఇరుపక్కల ఎపుగా దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారాయి. ఎదురేదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రతిరోజూ ఉదయాన్నే ప్రభుత్వ మరియు ప్రయివేటు ఉద్యోగస్తులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఈ రహదారి నుండే వెళ్తుండటం గమనార్హం. దట్టమైన మొక్కలు పెరిగిపోయి దానికి తోడు ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులతో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే అనేక సార్లు ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా జీవితాంతం అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి తీరని బాధలు మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు సంభవించే ముందు అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల విస్తరించిన ముళ్లచెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.