నిమ్జ్ అక్రమ నిర్మాణాల కూల్చివేత….
◆-: .5 కోట్ల ఉద్ద స్థలాన్ని స్వాధీనం
◆-: కబ్జాదారులపై విచారణ చేపడుతున్న రెవెన్యూశాఖ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు దాదాపు రూ.5 కోట్ల విలువచేసే అసైన్డ్ (ప్రస్తుతం నిమ్జ్) భూమిని దర్జాగా కబ్జాచేశారు. అధికార, విపక్ష పార్టీల మద్దతుతో దాదాపు మూడున్నర సంవత్సరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని క్రయ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. రూ: కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి ఎదేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఎట్టకేలకు గ్రామానికి చెందిన కొందరు.. రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కబ్జాకు గురైన స్థలంలోని పలు నిర్మాణాలను కూల్చివేసి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కబ్జాకు గురైన 3.20 ఎకరాల అసైన్డ్ భూమి
సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, అల్లాదుర్గం మెటల్ కుంట రోడ్డు, హద్నూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 145లో గల అసైన్డ్ భూమిని జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)కి కేటాయించారు. సంబంధిత అసైన్డ్ పట్టాదారుడికి ప్రభుత్వం నష్టపరిహారి సైతం అందజేసింది. కప్ షాపు గురైన స్థలం గ్రామ కంఠం పరిధిలో ఉండడం, సమీపాన రైతు వేదిక, విద్యుత్ ఉపకేంద్రం, జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకుని గుంటలు, ప్లాట్లుగా మార్చి క్రయ, విక్రాలు చేపట్టాలని దందా కొనసాగించారు. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా భూమిని స్వాధీనం చేసుకొని భూమి చుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేశారు. రూ.10, 8, 6, 5, 4, 3, 2 లక్షల చొప్పున పదుల సంఖ్యలో విక్రయాలు చేపట్టినట్టు సమాచారం. కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు దృష్టి సారించారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ఆసరా తీసుకొని కొందరు స్థానిక రాజకీయ నాయకులు.. ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా ప్రయోజనం చేకూర్చుకునేందుకు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం విషయంలో స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పెద్దగా దృష్టి సారించలేకపోయారు.
ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ
గ్రామానికి చెందిన కొందరు యువకులు, రైతులు నేరుగా స్థానిక తహసిల్దార్కు ఇటీవల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జాతీయ ఉత్పాదక మండలి ప్రాజెక్టు కు కేటాయించిన ప్రభుత్వస్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే నిలిపివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అట్టి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తహసిల్దార్ ప్రభు ఆదేశాల మేరకు శుక్రవారం ఉప తహసిల్దార్ రాజిరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ఎస్సై సుజిత్, పోలీస్ సిబ్బంది రక్షణలో ఆక్రమణల కూల్చివేతను కొనసాగించారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూల్చివేత కొనసాగింది. సర్వే నెంబర్ 145 ప్రభుత్వ భూమని, అక్రమంగా నిర్మాణాలు, క్రయ విక్రయాలు చేపడితే రెవెన్యూ, నిమ్స్ చట్టం ప్రకారం కేసులు తప్పవని తహసిల్దార్ హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని క్రయ, విక్రయాలకు కొనసాగిస్తున్న వ్యక్తులను గుర్తించి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టనుట్లు తహసిల్దార్ తెలిపారు.
