సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి

సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి:-

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ :-

హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా, ఒక వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తి సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. మొదటిసారిగా భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఈ విధానం విజయవంతం అయిందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. ఆ తరువాత ఈ విధానం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చేరి అక్కడ కూడా విజయవంతమైందన్నారు. అయితే 2023వ సంవత్సరంలో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందని ఆయన అన్నారు.

Community

ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం భార్యాభర్తల మధ్య ఈగో లు వారి మధ్య వివాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయని వీటిని సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయస్థానాలలో కేసులు ఉంటే, ఇరుపక్షాలలో ఒకరు గెలిస్తే మరొకరు పైకోర్టుకు వెళ్తారని కానీ కమ్యూనిటీ మీడియేషన్ విధానంలో వివాదం పరిష్కారమైతే వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని ఇటువంటి గురుతర బాధ్యతను పెద్దలు తమ భుజస్కంధాల మీద వేసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లో ఒక విశ్రాంత వైస్ ఛాన్స్లర్ కమ్యూనిటీ మీడియేటర్ గా సాధించిన విజయాలను వివరించారు. కలహిస్తున్న భార్య భర్తలకు ఒక తండ్రి లాగా తాత లాగ నచ్చచెప్పి వారిని కలిపినట్లు ఆయన చెప్పారన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ ఏడవ తారీకున కామారెడ్డి లో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి. నిర్మలా గీతాంబ, సి.హెచ్. రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమా దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version