స్వీయ గణన ప్రక్రియ ద్వారా జనగణన వేగవంతం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
జనగణన-2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ద్వారా కార్యక్రమం వేగవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం సబ్బెపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు,సూపర్ వైజర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జన గణనను 2 విడతలుగా నిర్వహించడం జరుగుతుందని, మొదటి విడతలో మే 11వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల గణన,2వ విడతలో జనగణన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితా రూపొందించడం జరుగుతుందని, ఇందు కొరకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు తగు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జరగనున్న స్వీయ గణన ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు.స్వీయ గణన కార్యక్రమం నిర్వహణలో ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,ప్రముఖ వ్యక్తులు, గణన అధికారులు,యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.జిల్లా స్థాయి జనగణన అధికారులు ప్రతిరోజు స్వీయ గణన వివరాలను నవీకరించాలని తెలిపారు.జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో స్వీయ గణనపై ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు స్వీయ గణన కార్యక్రమ కార్యచరణను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు జనాభా ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందని,ఈ క్రమంలో స్పష్టమైన జాబితా రూపొందించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని తెలిపారు.మే 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో https://se.census.gov.in వెబ్ సైట్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని,ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నెంబర్ వినియోగించాలని,ఇండ్ల గణనకు సంబంధించి 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి రివ్యూ ద్వారా పరిశీలించుకోవాలని తెలిపారు.మే 11వ తేదీ నుండి ఇండ్ల గణన అధికారులు కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు ఈ నెంబర్ ను అందించాలని తెలిపారు.ఆ సమయంలో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఎన్యుమరేటర్ ద్వారా సవరించుకోవచ్చని తెలిపారు.వేసవి దృష్ట్యా ఉదయం,సాయంత్రం వేళలలో తమకు కేటాయించిన బ్లాక్ లలోని ఇండ్లను సందర్శించేలా కార్యచరణ రూపొందించుకోవాలని,ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి సుమన్ తో కలిసి సందర్శించి వార్డులు, మందుల నిల్వలు,ల్యాబ్,ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని,ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.గర్భిణుల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగే విధంగా ఆశ,ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
