బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం
-అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ ఒప్పందం
-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ వాళ్లు బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు విమర్శించారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగల ముఠాల రాష్ట్రాన్ని పదేండ్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారు చేసిన అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీకి దాసోహమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బలహీనతలను ఆసరాగా చేసుకున్న బీజేపీ రాష్ట్రానికి స్వయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. గత పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకు బీజేపీ ఊడిగం చేసింది నిజం కాదా? అని అడిగారు. సంఖ్యా బలం లేని బీజేపీ ఏ అండ చూసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ పార్టీ తాపత్రయపడుతుందన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే తమ సర్కార్ గొప్ప పనులను చేపట్టిందని, అలాంటి సర్కార్ ను విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదన్నారు.