బీజాపూర్ ఎన్కౌంటర్.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..
బీజాపూర్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 20కి పెరిగింది.
బీజాపూర్ జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్(Chhattisgarh Encounter) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కి పెరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తొలుత ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో మరికొన్ని మావోయిస్టుల మృతదేహాలు కనిపించినట్లు తెలుస్తోంది. మొత్తంగా మృతుల సంఖ్య 20కి చేరినట్లు సమాచారం. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. బుధవారం జరిగిన ఈ ఆపరేషన్ లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా భద్రతా(DRG STF COBRA Operation) బలగాలు పాల్గొన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఉంది. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన రెండు ఎన్కౌంటర్ల ప్రభావం ఈ ప్రాంతంలో ఇంకా తగ్గలేదు. ఇలాంటి సమయంలో మంగళవారం నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్జీవో వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజాపూర్(Bijapur Encounter) ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ రెండు ఘటన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
