vyardalatho niduthunna peddacheruvu, వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పాడవేసిన చెత్తతో దుగ్గొండి పెద్దచెరువు వ్యర్థాలతో నిండిపోతున్నదని బహుజన సమాజ్‌వాది పార్టీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జి దయాకర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్ర పెద్దచెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోయి చెత్త, జంతు కళేభరాలు, వివిధ రకాల వ్యర్థలతో నిండి వున్నాయని, రాబోయే వర్షాకాలంలో చెరువు నిండి ఆ వ్యర్ధాలతో తాగునీటి బావిలో కలిసి తాగునీరు కూడా కలుషితం అయ్యి ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే గ్రామంలోని జంతువులు చెరువులో నీటిని ఎల్లప్పుడు తాగుతూ ఉంటాయని, అవి కూడా రోగాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యల పట్ల సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకుని వాతావరణ కాలుష్య నివారణను అరికట్టాలని దయాకర్‌ కోరారు.

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆటోడ్రైవర్‌ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్‌ వరకు..

ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్‌ నేడు జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఆనాటి నుండి టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో జడ్పిటిసిగా ఎన్నికైనారు.

ఉద్యమరాలుగా మొదలై జడ్పి ఫ్లోర్‌లీడర్‌గా….

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విభాగంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ది స్వప్న అనేక పోరాటాలలో పాల్గొన్నది. అనేకమార్లు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలో లాఠీదెబ్బలకు బలై, జైలు జీవితం అనుభవించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు రాజకీయంలో క్రియాశీలకంగా మారాలని పిలుపుతో నేడు నల్లబెల్లి మండలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొంది వరంగల్‌ రూరల్‌ జిల్లా జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికైనారు.

ఆనాడు భర్త…ఈనాడు భార్య….

తెలంగాణ ఉద్యమ పోరాటం గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరే విధంగా ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ గళాన్ని వినిపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు జరిగిన జడ్పీటిసి ఎన్నికల్లో నల్లబెల్లి మండలం నుండి జెడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికైనా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికై తన సత్తాను చాటారు. నేడు అదేబాటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పెద్ది స్వప్న నేడు నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికై వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దుగ్గొండి, నల్లబెల్లి మండల ప్రజల హర్షం వ్యక్తం

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల దుగ్గొండి, నల్లబెల్లి మండలాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

bandedu baram…private chaduvu, బండెడు భారం…ప్రైవేటు చదువు

బండెడు భారం…ప్రైవేటు చదువు

వరంగల్‌ నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పాఠశాలలో, పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విక్రయించాలి లేదంటే అంతే సంగతులు. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పత్తాలేకుండా పోతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా కొన్ని వందలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నా, నాణ్యమైన విద్యను అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పత్తా లేని విద్యాశాఖ అధికారులు

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొత్తకొత్త పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు. విచ్చలవిడిగా ఫీజులు గుంజుతున్న కానీ విద్యాశాఖ అధికారులకు పట్టింపే లేకుండా పోతుంది. జిల్లావ్యాప్తంగా వందల ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు మాత్రం వేలల్లో వసూలు చేస్తున్న నాణ్యమైన విద్యను అందించడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలని పడుతున్న ఆరాటాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పోటీపడడమే దీనంతటికీ కారణమని తెలుస్తుంది. కాని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజుల ధరలను చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.

పాఠశాలల్లోనే విక్రయాలు

దాదాపు నగరంలో పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలతోపాటు విద్యార్థికి అవసరమైన సామాగ్రి విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలో పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విద్యార్థికి కావాల్సిన సామాగ్రి, పుస్తకాలు కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టడం జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. విద్యాశాఖ అధికారుల నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికభారం పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి పాఠశాలలో నోటీసు బోర్టుపై తరగతుల వారిగా ఫీజుల వివరాలను నమోదు చేయాల్సి ఉన్నా అది ఎక్కడ కూడా నమోదు చేయడం లేదు. జీవో నం1 ప్రకారం తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించిన ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. కానీ ఆ పరిస్ధితులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం అధికారుల కొరతతో ప్రైవేట్‌ యాజమాన్యం ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండానే పోతుంది. ప్రైవేట్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన కమిటీల సిఫార్సు ప్రకారమే ఫీజుల ధరలను నిర్ణయించాలి. దీనికోసం 2010లో ప్రభుత్వం జీవో నెం42ను తీసుకొచ్చింది. జీవో నెం42ను వ్యతిరేకిస్తూ 2014లో పాఠశాల యాజమాన్యం కోర్టుకు వెళ్లడంతో అర్థాంతరంగా నిలిచిపోయింది. జీవో నెం42 రద్దు చేయాలని ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. అప్పటినుంచి యాజమాన్యాలు అడ్డుఅదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాల యాజమన్యాలు యూనియన్లుగా ఏర్పడి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.

అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం

విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రజల్లో అవగాహన లేకపోవడంతో అధికారులు అమలుచేయడం లేదు. చట్టప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25శాతం సీట్లను దారిద్రరేఖకు దిగువన ఉన్న విద్యార్థులకు అందించాలి. కాని ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాల ఉచితంగా సీటును వదులుకోవడం లేదు. అలాగే చట్టప్రకారం అవసరం మేరకు పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందించాలి. ప్రజలకు పాలన సమీపంలో ఉన్న నేపథ్యంలోనైనా కలెక్టర్‌ దష్టి సారిస్తే కొంతమేరకైనా ఫీజుల భారం తగ్గుతుందని పలువురు అంటున్నారు.

కనీస వసతులు ప్రమాణాలు లేక పాఠశాల నిర్మాణాలు

పాఠ్యపుస్తకాల విక్రయదారులతో పాఠశాల యాజమాన్యాలు అనుసంధానంగా పుస్తకాల వ్యాపారం నడుస్తుంది. వరంగల్‌ నగరంలో ప్రధానంగా కొన్ని పుస్తక ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని పాఠశాలలను ఎంచుకొని వారికి కొంత నగదు ముందే సమర్పించుకుంటారు. పాఠశాల విద్యార్ధులని బట్టి ముందే డబ్బులు అందచేస్తారు. అక్కడ నుండి మొదలవుతుంది వ్యాపారం. వ్యాపారంలో 40శాతం వరకు పాఠశాల యాజమాన్యాలకు అందచేస్తున్నట్టు సమాచారం. వీరి స్వలాభం కొరకు విద్యార్థుల తల్లితండ్రులపై విపరీతమైన భారం పడుతుందని చెప్పొచ్చు. ఇలా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసినా కానీ నాణ్యమైన విద్యని అందిస్తారని నమ్మకం కూడా తల్లితండ్రులు కోల్పోతున్నారు అని చెప్పొచ్చు. కొన్ని పాఠశాలల విద్యార్థులకు ఆటస్థలాలు లేకుండా బహుళ అంతస్తులో తరగతులు నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటంలో మతలబు ఏంటని తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఏదైనా అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగితే బహుళ అంతస్తులో ఉన్న విద్యార్థులు ఏదైనా ప్రమాదానికి గురైతే భాద్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం అగ్నిమాపక వాహనం పాఠశాల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో పాఠశాల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తున్నారు అని విద్యాశాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలు దోపిడీ….!

ఒకటవ తరగతి పుస్తకాల ఖరీదు 4,800రూపాయలు

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతున్నారు. ఫీజుల భారంతోపాటు పాఠ్యపుస్తకాల కొనుగోలు భారాన్ని మోపుతున్నారు. దీంతో తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు. వరంగల్‌ నగరంలోని ఓయాస్సిస్‌ అనే పాఠశాల ఉమ బుక్‌స్టాల్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కమిషన్‌లు దండుకుంటూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. వీరు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న ధరను చూస్తే గుండెలు గుభేలుమంటాయి. ఒకటవ తరగతికి వీరు అక్షరాల నాలుగువేల ఎనిమిదివందల రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇదేంటని తల్లితండ్రులు నిలదీస్తే ఇది ఇంతే. మా దగ్గర తప్ప ఈ పుస్తకాలు ఎక్కడ దొరకవు అంటూ నిర్లక్షపు సమాధానం ఇస్తున్నారట. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.

vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో వితంతువు మహిళలకు సమానస్థానం కల్పించాలని, వితంతువులపై వివక్షత విడనాడాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రంజిత్‌కుమార్‌గౌడ్‌, గ్రామ పంచాయతీ పాలకవర్గ సబ్యులు కాందారి రమేష్‌, బాలరాజు, చీర రాజమణి రమేష్‌, సంధ్య శ్రీధర్‌, బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌, కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

gananga hazrath hazi baba utsavalu, ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు

ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు

ఉర్సు బొడ్రాయిలో గల హజ్రత్‌ హాజి కలందర్‌ బాబా ఉత్సవాలు ఘనంగా జరిగాయని దర్గా అధ్యక్షుడు మహ్మద్‌ మషూక్‌ తెలిపారు. శుక్రవారం అల్లాకు సందల్‌ను ఆయన నెత్తిన పెట్టుకుని విన్యాసాలతో అల్లాకు చాదర్‌ను సమర్పించానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజీ కలందర్‌ బాబా ఉత్సవాలలో ముస్లీంలతోపాటు హిందువులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారన్నారు. అనేకమంది భక్తులు తమ కోరికలను బాబా నెరవేరుస్తాడనే నమ్మకంతోనే చాలామంది బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాలను ముస్లీం మతగురువు ఉబేర్‌బాబా ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేడల పద్మ, 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మరుపల్ల రవి, ముస్లీం నాయకులు యాకుబ్‌పాషా, అక్బర్‌, తాజ్‌బాబా, రఫీక్‌, ఫకీర్‌, హైమద్‌ఖాజీ, మరుపల్ల గౌతమ్‌, బైరి వినయ్‌ పాల్గొన్నారు.

private degree collegelapia cheryalu thisukovali, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

పట్టణంలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇంచార్జ్‌ మంద శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్‌ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్‌కు 6నుండి 7వేల రూపాయలు ఇస్తూ అక్రమంగా అడ్మిషన్లు కొంటూ విద్యవ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతుంటే వారికి డబ్బుల ఆశ చూపి కాలేజీలకు లాక్కుంటున్నారన్నారు. దీని వలన పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఈ కాలేజీలపై వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, ఎగ్జిమినేషన్‌ కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్‌, గణేష్‌స్వామి, బరత్‌, ప్రభాస్‌, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

cheruvu matti mayamavuthondi, చెరువు మట్టి మాయమవుతోంది…!

చెరువు మట్టి మాయమవుతోంది…!

వరంగల్‌ నగర శివారులో చెరువు మట్టి మాయమైపోతుంది. మట్టి మాఫియాలు రెచ్చిపోతుండడంతో లక్షల్లో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరశివార్లలోని చెరువుల్లో మట్టిని అడ్డగోలుగా, ఇష్టారీతిన తవ్వుతున్నారు. చెరువు మధ్యలో జెసిబిలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ టిప్పర్ల కొద్ది మట్టిని దొంగచాటున తరలించుకుపోతున్నారు. మిషన్‌ కాకతీయ పేరుతో ఈ మట్టి దొంగరవాణకు కాంట్రాక్టర్లు తెగబడుతున్నారు.

దొంగచాటు రవాణా…

ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారులో దాదాపు 15మందికిపైగా కాంట్రాక్టర్లు చెరువుల్లో మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు. రాత్రివేళల్లో ఈ మట్టి తవ్వకాన్ని కొనసాగిస్తున్న వీరు చెరువులకు సమీప ప్రాంతంలోనే డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఇటుక బట్టీలకు మట్టిని రవాణా చేస్తున్నారు. ఒక టిప్పర్‌ లోడ్‌కు వేల రూపాయల్లో వసూలు చేస్తున్న మట్టి కాంట్రాక్టర్లు లక్షల్లో దండుకుంటున్నారు.

కళ్లు మూసుకున్న రెవెన్యూశాఖ

వరంగల్‌ అర్బన్‌ శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలను కొనసాగిస్తూ దొంగచాటుగా రవాణా చేస్తున్న అధికారులు మాత్రం తమకేం తెలియనట్లు, పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మట్టి అక్రమరవాణా గూర్చి ప్రశ్నిస్తే మట్టి తవ్వెటప్పుడు తమకు సమాచారం అందించండని గ్రామస్తులకు ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలిసింది. రాత్రివేళల్లో తవ్వి డంప్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తవ్వే సమయంలో తప్ప, డంప్‌ చేసేటప్పుడు చర్యలు తీసుకునే అవకాశం లేదని స్థానిక విఆర్వోలు రూల్స్‌ వల్లె వేస్తున్నారట. రెవెన్యూ అధికారుల తతంగం అంతా చూస్తుంటే కాంట్రాక్టర్లు వీరిని ఎప్పుడో ప్రసన్నం చేసుకుని ఉంటారని నగరశివారు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

బాసే తన భర్తంటున్న భామ

బాసే తన భర్తంటున్న భామ

అవును…మీరు రాసిన ‘భామ’తో..బాస్‌…అనే శీర్షికలో ఆ బాస్‌ నా భర్తే…ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆఫీసులో కూడా అందరికి తెలుసు..బాస్‌ వాళ్ల భార్యకు, పిల్లలకు కూడా తెలుసు…మీరు ఎలా రాస్తారు..మా అన్న ఓ మంత్రి దగ్గర ఉంటాడు…అంటూ పరోక్షంగా హెచ్చరించిన భామ…

(ఎవరా…బాస్‌..ఎక్కడా ఆ ఆఫీస్‌) త్వరలో…

badi baata, బడిబాట

బడిబాట

మండలంలోని పాత్రపురం గ్రామంలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రపురం గ్రామ పంచాయితీలో శుక్రవారం అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ‘ప్రైవేటు బడి వద్దు…అంగన్‌వాడీ ముద్దు’, ఇంటింటికి అంగన్‌వాడీ అనే నినాదంతో పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని, ఉచితవిద్య, పోషకాహారంతోపాటు ఆరోగ్యంగా పిల్లల ఎదుగుదల ఉంటుందని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తులలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కష్ణార్జున్‌రావు, వార్డుమెంబరు కారం వెంకటలక్షి, సూపర్‌వైజర్‌ రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు విజయ శుషంతల, చుక్కమ రామకష్ణ, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

hotel sharanyalo agnipramadam, హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించవచ్చునని పలువురు భావిస్తున్నారు. హూటల్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా చూశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో భారీ ఆస్తినష్టం సంభవించే అవకాశాలు ఉండేవని హూటల్‌ సిబ్బందితోపాటు పలువురు భావిస్తున్నారు.

antharjathiya sadasuku doctor rajkumar, అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

దుగ్గొండి మండల ప్రశాంతి మహిళా సమాఖ్య ఏపీఎం డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌ అంతర్జాతీయ యువత సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుండి వచ్చే నెల 1తేదీ వరకు బ్యాంకాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో జరిగే అంతర్జాతీయ యువత సదస్సుకు భారతదేశ ప్రతినిధిగా హాజరవుతున్నట్లు తెలిపారు. యువత నిర్మాణ పాత్ర, యువత రాజకీయం, యువత నాయకత్వ లక్షణాలు, రాబోయే తరాలకు యువత ఇచ్చే సందేశాలు, సామాజిక బాధ్యతలు తదితర అంశాలపై ఈ సదస్సులలో మాట్లాడనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 12దేశాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొని భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన ఘనత తనకే దక్కిందని గుర్తుచేశారు. బ్యాంకాక్‌ దేశం నుండి 2వ సారి ఆహ్వానం అందిందని, గత 25సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. భారతదేశ ప్రభుత్వం నుండి 4 జాతీయస్థాయి పురస్కారాలు, అలాగే ప్రపంచ దేశాలల్లో 5సార్లు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నట్లు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. బాలవికాస గత 25సంవత్సరాల నుండి సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తూ అవగాహన కల్పిస్తూ సామజిక ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అతి చిన్నవయసులో ఉన్న వితంతు మహిళలు అవగాహన లేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారన్నారు. ఆదర్శ గ్రామాల సర్పంచ్‌లు మూఢ ఆచారాలను అరికట్టి ఆదర్శంగా నిలవాలని కోరుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొనకల్‌ సర్పంచ్‌ బొమ్మగాని ఊర్మిళ, రేబల్లె సర్పంచ్‌ గటికే మమత, భాగ్యలక్ష్మి, సుజాత, భాగ్య, సమత, కవిత, సరస్వతి, లలిత, రాజమణి, సంధ్య, కోమల, రాజక్క, అరుణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి సంబంధించి వచ్చిన టిఎ, డిఎల్లో భారీగా దండుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ వ్యవహారం ఇప్పుడే జరుగుతున్నది కాకపోయినా తాజాగా ఈయన వ్యవహరిస్తున్న తీరు పట్ల విసుగు చెందిన ప్రభుత్వ అధికారులే ఈయన జరుపుతున్న వ్యవహారంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారంటే సదరు రెవెన్యూ అధికారి ఆగడాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పకనే చెబుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఎన్నికల విధుల్లో పనిచేసిన అనధికార వ్యవస్థకు సంబంధించిన వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.

వివిధ శాఖల అధికారుల అలవెన్స్‌లలో కమీషన్లు…

శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఇతర ఎన్నికల విధుల్లో భాద్యతలు నిర్వహించిన వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారుల రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి గెజిటెడ్‌ అధికారులు మైక్రో అబ్జర్వర్లుగా, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌, వీడియో సర్వేలైన్స్‌ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టి విభాగాలకు సంబంధించి శాసనసభ ఎన్నికల్లో 52రోజులు, పార్లమెంట్‌ ఎన్నికల్లో 22రోజులు విధులు నిర్వహించారు. వీరు నిర్వహించిన విధులకుగాను ఎన్నికల కమీషన్‌ ఇచ్చిన అలవెన్స్‌లలో భారీగా కమీషన్ల రూపంలో దండుకున్నారు. పనిచేసిన కాలానికి ఎంత మొత్తం వచ్చింది అని వారు అడిగినప్పటికి పూర్తి అలవెన్స్‌ రాలేదని, ఇంతే వచ్చిందని మరికొందరు అధికారులకు చెప్పి వారితో అలవెన్స్‌లు ముట్టినట్లు సంతకాలు తీసుకున్నారు. సదరు రెవెన్యూ అధికారి వ్యవహరిస్తున్న తీరుపై చేసేదెమి లేక ఇచ్చిందే పుచ్చుకుని సైలెంట్‌ అయ్యారు.

ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

ఎన్నికల విధుల్లో భాగమైన ప్రైవేట్‌ వాహనాలు, ఫోటో, వీడియోగ్రాఫర్లు, టెంట్‌హౌజ్‌ ఇలా అన్ని వ్యవస్థల్లోనూ ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం. ఉన్నతస్థాయి గెజిటెడ్‌ అధికారుల అలవెన్స్‌లలోనే కమీషన్లకు దిగిన ఆయనకు అనధికార వ్యవస్థలో విధులు నిర్వహించిన వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. వారికి పూర్తి డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడానికి ముందుగానే తన చేతివాటంతో లంచాలు తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల విధులకు సంబంధించిన వీరికి వచ్చిన నిధులను సగానికిపైగా స్వాహా చేసి అధికారులు వాటాలు పంచుకున్నారని, ప్రతి ఎన్నిక సందర్భంలోనూ రెవెన్యూ అధికారులు ఇలానే చేస్తారని ఫోటో, వీడియోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల కమీషన్‌ ఎంత కేటాయించిందో అంతా గోప్యం…

ఎన్నికల సంధర్భంగా విధులు నిర్వహించిన వివిధ విభాగాల వారికి కమీషన్‌ అలవెన్స్‌లు, ఖర్చుల కొరకు నిర్ధిష్టమైన మొత్తాలను కేటాయిస్తారు. కానీ ఈ ఖర్చుల మొత్తాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. విధులు నిర్వహించిన ప్రభుత్వ గెజిటెడ్‌ తెలుపుతున్న సమాచారం ప్రకారం అలవెన్స్‌లుగా 1200రూపాయలు ప్రతిరోజుకు ఇస్తారని అంటున్నారు. అధేవిధంగా ఫోటో, వీడియో గ్రాఫర్లకు భోజన ఖర్చులకు, టెంట్‌ హౌజ్‌, కిరాయి వాహనాలకు ఖర్చులను కేటాయిస్తారు. కానీ ఎవరికి ఎంత కేటాయిస్తారనేది మాత్రం రెవెన్యూ అధికారులకు మినహాయించి మరెవ్వరికి తెలియదు. తెలియకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. పనిచేసిన వారికి వచ్చిన అలవెన్స్‌లు, జీతభత్యాలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఎందుకు ఉంచుతారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

స్థానిక రెవెన్యూ అధికారి కనుసన్నలోనే వ్యవహారమంతా…?

స్థానికంగా రెవెన్యూ కార్యాలయంలో కీలక అధికారి అయిన ఒకరి చేతుల్లోనే ఈ వ్యవహారమంతా జరుగుతుందని ఎన్నికల విధుల్లో పని చేసిన వారు చెబుతున్నారు. కీలక అధికారి కావడంతో సమన్వయలోపం ఏర్పడుతుందని చేసేదేమి లేక ఇచ్చిన మొత్తాన్నే విధులు నిర్వహించిన వివిధ శాఖల అధికారులు తీసుకుంటే, ఇక అనధికార వ్యవస్థకు సంబంధించిన వారు ఇదేంటని అడిగితే మరోమారు వారి అవకాశం ఇవ్వరనే భయంతో ఆ అధికారిని ప్రశ్నించడం లేదు. దీంతో ఆయన చేస్తున్న అవినీతి వ్యవహారానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. సదరు అధికారి చేస్తున్న అవినీతిలో ఉన్నత అధికారులకు వాటాలు చేరుతాయని, అందుకే వారు కూడా ఈ వ్యవహారం గురించి నిమ్మకు నిరెత్తనట్లు వ్యవహరిస్తూ ఆయనకు అవసరమైన అండదండలు అందిస్తారని అందరు చెప్పుకుంటున్నారు. సమాజంలో కీలకశాఖలో పనిచేస్తూ ప్రతి అంశంలో అవినీతికి పాల్పడుతూ ఇటు ప్రజలను,అటు అధికారులను వదలకుండా చేస్తున్న వ త్తికి కలంకం తెస్తున్న సదరు అధికారి వ్యవహారం గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన విచారణ చేసి ఎన్నికల విధుల్లో పాల్గోన్న సిబ్బందికి, ప్రజలకు న్యాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్‌సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు సేకరించినట్లు సమాచారం. ఆదారాలను తీసుకొని అన్ని సంఘాలను కలుపుకొని సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్పిస్తున్నామని తెలిపారు.ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో సీఎం కేసీఆర్‌ను కలవటం కుదరలేదని ఎన్నికల బీజీ అయిపోయినందున, ఇప్పుడు కలువడానికి అపాయింట్‌మెంట్‌ కొరకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఆర్జేడికి ఫిర్యాదుచేసినా పట్టించుకోని వైనం

అవినీతిపై విచారణ కమిటినీ వేయాలని, బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై ‘నేటిధాత్రి’లో వచ్చిన కథనాలను జతపరుస్తూ వరంగల్‌ ఆర్జేడి ప్రదానకార్యాలయంలో నేటిధాత్రి ప్రతినిధి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని, అవినీతికి పాల్పడిన వారికి ఆర్జేడి కార్యాలయంలో ఎవరైనా సహకరిస్తున్నారా? అనే అనుమానం లుగకమానదు.ఓ వైపు ఇంటర్‌బోర్డులో నిర్లక్ష్యం వెటాడుతుండగా మరో వైపు వరంగల్‌ ఆర్జేడి కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. అసలు ఫిర్యాదు ఆర్జేడికి అందించారా? అందించలేదా అన్న సందేహం కలుగుతున్నది.

కేసీఆర్‌ పాలనపై ప్రజలకు అపారనమ్మకం

రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనై ప్రజలకు అపారనమ్మకం ఉన్నది. ఆయన చేపడుతున్న అబివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై కూడా చర్యలుంటాయని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే విచారణ కమిటిని నియమించి అవినీతిని బయటపెట్టి బాధ్యులను ఉద్యోగాల నుండి సస్పెండ్‌ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అధికార యంత్రాంగం నమ్మకాన్ని వమ్ముచేయొద్దు

సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్నివమ్ముచేయకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాయలాల్టో ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్‌ ఆదేశాలను అధికారయంత్రాంగం తూ.చ. తప్పకుండా పాటించినప్పుడే కేసీఆర్‌ ఆదేశాలను పాటించినట్టవుతుందని, అప్పుడే కేసీఆర్‌పై ప్రజల్టో మరింత విశ్వసనీయత పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై అధికార యంత్రాంగం కేసీర్‌ ఆదేశాలను గౌరవిస్తుందా? పెడచెవినపెడుతుందా వేచి చూడాల్సిందే…!

nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….

నిఘా వర్గాలు మేల్కొనాలి….

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్‌ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్‌, స్టేషనరీ, పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన లెక్చరర్‌ల బిల్లుల విషయంలో కూడా లెక్కకు మించి తప్పుడు బిల్లులు పెట్టి ప్రభుత్వ సొమ్మును మెక్కాశారని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాయిబాబా, లింగయ్యలను సస్పెండ్‌ చేయాలి

ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో భారీ అవినీతికి సూపరింటెండెంట్‌ సాయిబాబానే చక్రం తిప్పాడని ఆయనే క్యాంపుకు సంబంధంలేని వారి పేర్లను సేకరించారని, సేకరించిన పేర్లను, అకౌంట్లను ఓ మహిళా జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి సాయిబాబాకు ఇచ్చాడని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పుడు బిల్లులను తయారుచేయాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి అప్పగించగా వారు సాయిబాబా చెప్పినట్టుగానే దొంగ పేర్లతో బిల్లులు తయారు చేయగా, డిఐఈవో లింగయ్య ఈ తతంగానికి సహకరించి సంతకాలు చేశాడని, లింగయ్య అండదండలతోనే ఈ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. భారీ అవినీతికి పాల్పడిన సూపరింటెండెంట్‌ సాయిబాబాను, డిఐఈవో లింగయ్యను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

ప్రిన్సిపల్‌ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలవనున్న విధ్యార్థి సంఘాలు

ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలు కలిసి అవినీతికి పాల్పడినారని వీరిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ కమిటినీ వేయాలని ఆర్జేడీకి, కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రలు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా ప్రిన్సిపాల్‌ సెక్రటరి జనార్ధన్‌రెడ్డిని కలిసేందుకు విద్యార్థి సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ముందుగా ఇంటర్‌బోర్డు కార్యదర్శిని కలువాలనుకున్నారు, కాని అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని డిఐఈవో లింగయ్య ఎక్కడ మేనేజ్‌చేస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇంతకాలం నిర్లక్ష్యం జరగడానికి కారణం డిఐఈవో లింగయ్య కమీషనరేట్‌ నుండి కార్యాలయం వరకు ఆయనకున్న పలుకుబడి కారణంగానే కమిటీ వేయకుండా ఆలస్యం జరిగి ఉండవచ్చన్న అనుమానంతోనే నేరుగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్ధన్‌రెడ్డిని కలవనున్నామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

pattapagale veluguthunna vididepalu, పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

వరంగల్‌ ఆరో డివిజన్‌ బెస్తంచెరువు మిట్టమధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్‌ దీపాలు. సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు అంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సబ్‌స్టేషన్‌ ఎఇ పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు విమర్శిస్తున్నారు.

hospital eduta darna, హాస్పిటల్‌ ఎదుట ధర్నా

హాస్పిటల్‌ ఎదుట ధర్నా

పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద శ్రీకాంత్‌, మడికొండ ప్రశాంత్‌ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.

vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్‌ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్‌ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ramjan shubakankshalu telipina cp, రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్‌ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ప్రార్థనల్లో ముస్లిం పెద్దలు, చిన్నారులను అలింగనం చేసుకోని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం చిన్నారులకు పోలీస్‌ కమిషనర్‌ చాక్లెట్లు పంపిణీ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version