జయముఖి ఇంజినీరింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
150 తాటిచెట్ల ధ్వంసం..ఇంజనీరింగ్ కళాశాలపై ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు.
ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..
మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్.
చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..
మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్
చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఆందోళన..
నర్సంపేట నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని మగ్దుంపురం గ్రామం శివారు జయముఖి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణంలో వున్న తాటివనాన్ని అక్రమంగా కాల్చి ధ్వంసం చేసిన జయముఖి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ముగ్దుపురం గౌడ పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు సతీష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ మేరకు కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ జయముఖీ కళాశాల ఆవరణలో ఉన్న వందలాది
తాటివనంలోని తాటిచెట్లను ఎన్నో సంవత్సరాలుగా కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. గౌడ సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారికి ఇష్టంవచ్చినట్లు దౌర్జన్యంగా సుమారు 150పైగా పెద్ద పెద్ద తాటిచెట్లను,బొత్తలను జెసిబిలు , కూలీల సహాయంతో నరికించి దగ్ధం చేయించారని దీంతో నిరుపేదలమైన మాకు జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొన్నది అవేదన వ్యక్తం చేశారు.తాటిచెట్లను అక్రమంగా ధ్వంసం చేశారని కళాశాల యాజమాన్యాన్ని అడగగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు.కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఆర్థికంగా నష్టపోయి జీవనోపాధి కోల్పోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు.
ఉపాధి కోల్పోయిన గీత కార్మికులు..
గీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల సంబంధించిన తాటివనాన్ని అక్రమంగా నరికి వేయడం పట్ల వారు జీవనోపాధిని కోల్పోతున్నారని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు. నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు మండలాలలో కొందరు అక్రమ దారులు రియల్ ఎస్టేట్ పేరుతో, నిర్మాణాల పేరుతో తాటి వనాలను విచక్షణరహితంగా నరికివేస్తున్నారని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గౌడ కులస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ కోరారు.
చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదు..
నర్సంపేట మండలంలోని ముగ్ధుపురం గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న సుమారు 150 తాటిచెట్లను అక్రమంగా నరికి,కాల్చివేసి ధ్వంసం చేసిన ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డివిజన్ పరిధిలోని గౌడ సంఘం సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న తాటి వనాలలో కొందరు వ్యక్తులు అక్రమంగా తాటిచెట్లను నరికి వేస్తున్నారని తెలిపారు. జయముకి కళాశాలలో తాటివనాన్ని ధ్వంసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే నర్సంపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అదిలాబాద్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు కళాశాల యాజమాన్యం నుండి నష్టపాడియాల వసూలు చేసి అందజేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను కోరారు.