తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల / నేటి ధాత్రి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా తీసుకొనే అవకాశం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా రెండూ కూడా తనకు రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధులపై వివక్ష ఎలా చూపుతారని ప్రశ్నించారు. గతంలో ఆంధ్ర ప్రజాప్రతినిధుల తరహాలోనే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కూడా భక్తులకు దర్శన, వసతి సదుపాయాలను టీటీడీ కేటాయించేది. అయితే ఈ మధ్యకాలంలో టీటీడీలో తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు చెల్లుబాటుకాకపోవడం, ఈ విషయంగా అనిరుధ్ రెడ్డి తిరుమలకు వెళ్లిన సమయంలో మీడియాలో మాట్లాడటం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన ఆంధ్ర మంత్రి ఒకరు టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత ఈ విషయంగా సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రకటించి వెళ్లారు. కానీ టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలని టీటీడీకి మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా తెలంగాణా ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని టీటీడీ తీసుకున్నది విధానపరమైన నిర్ణయం కాగా.. ఈ నిర్ణయాన్ని టీటీడీ ఈఓ సొంతంగా తీసుకోలేరని దీనికి సీఎం అనుమతి అవసరమౌతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్ర, తెలంగాణా తనకు రెండు కళ్లని గతంలో చెప్పిన చంద్రబాబు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా ఆమోదిస్తారని నిలదీశారు. ఒకవేళ సీఎంకు తెలియకుండా టీటీడీ అధికారులే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేసారు. తిరుమల ఆలయానికి ఆంధ్ర భక్తుల కంటే తెలంగాణా భక్తులే అధికంగా వెళ్తారని, టీటీడీకి భక్తుల ద్వారా సమకూరే ఆదాయంలో ఎక్కువ భాగం తెలంగాణా భక్తుల నుంచే వస్తుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీలో పరిగణలోకి తీసుకొనేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ అధికారుల ధోరణి మారకపోతే తెలంగాణాలోని జోగుళాంబ నుంచి బాసర దాకా, భధ్రాచలం నుంచి చిలుకూరి బాలాజీ దాకా తెలంగాణలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆంధ్ర వీఐపీల సిఫార్సు లేఖలను ఆమోదించకూడదని, వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించకూడదని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరుతామని, అసెంబ్లీలోనూ.. ఈ విషయంగా నిర్ణయం తీసుకొనేలా చూస్తామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా టీటీడీ, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ప్రజాప్రతినిధులను కూడా గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version