వనపర్తి నేటిదాత్రి: పార్లమెంట్ ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించడం లో విలేకరుల పాత్ర చాలా కీలకం అని
జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్లో జర్నలిస్టులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల్లో మీడియా పాత్ర గురించి వర్క్ షాపు నిర్వహించారు
ఈ సందర్భంగా డీపీఆర్వో సీతారాం మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలకమైందని, జర్నలిస్టులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే వాటిని అధికారుల ద్రుష్టికి తీసుకురావాల్సిన కీలక బాధ్యత మీడియాపై ఉంది అన్నారు. ఎన్నికల్లో మీడియా ప్రతినిధులు ఎలాంటి వార్తలు రాయాలనే దానిపై కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ద్రుష్టికి వస్తే సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఎఫ్ఎస్టీ, ఎస్ ఎస్ టీ సహా ఇతర టీంల విధి విధానాల గురించి కూడా జర్నలిస్టులకు సవివరంగా తెలియజేశారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం పత్రికల్లో ఇచ్చే ప్రకటనలపై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ నిఘా పెడుతోందని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషియల్ మీడియాల్లో వెలువరించే ప్రతి పెయిడ్ న్యూస్ను కమిటీ పరిశీలిస్తుంది అని తెలిపారు. అంతే కాక ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సర్టిఫికేషన్ ధ్రువీకరణ జారీ చేసే ప్రక్రియనూ ఈ కమిటీ నిర్వర్తిస్తుందని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు ఆయా ప్రటకనలకు సర్టిఫికేషన్ ఇస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులకు సంబంధించి వెలువరింటే కథనాల్లో పెయిడ్ న్యూస్ను కమిటీ సభ్యులు గుర్తించడం జరుగుతుందని తెలిపారు.
సమావేశానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు
