కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను అభినందించిన యస్ ఐ రవికుమార్
మంగపేట నేటి ధాత్రి
మల్లూరు లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన యువతి మొబైల్ పోగొట్టుకోవడంతో బ్రాహ్మణ పల్లి చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ట్రేస్ చేసి మొబైల్ ను తిరిగి ఇచ్చారు. బాధితురాలు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం జిల్లా చెర్ల గ్రామానికి చెందిన రెడ్డి స్వరూప కుటుంబ సమేతంగా ఆటోలో భద్రాచలం నుంచి మల్లూరు టెంపుల్ దర్శనానికి వెళుతున్న క్రమంలో ఉదయం 10గంటలకు తన ఫోన్ ని కోమటిపల్లి – రాజుపేట మార్గం మధ్యలో పోగొట్టుకుంది. మొబైల్ పోయిందని గ్రహించిన స్వరూప వెతుకుతూ చెక్ పోస్ట్ వద్దకు వచ్చి ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు తెలిపింది.స్పందించిన మంగపేట పోలీస్ కానిస్టేబుల్ జి.రాజ్ కుమార్ విచారణ చేసి యువతి పోగొట్టుకున్న ఫోన్ ను గంటన్నర వ్యవధిలో దొరకబట్టి అప్పగించారు. రూ.25వేల విలువైన ఫోన్ దోరకబట్టి అప్పగించిన పోలీసులకు స్వరూప కృతజ్ఞతలు తెలియజేసింది. కాగా, కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

