*పలమనేరు అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనున్న మోడల్ మార్కెట్..
*ఎమ్మెల్యే సమక్షంలో మార్కెట్ నిర్మాణానికి భూహద్దులను నిర్ణయించిన అధికారులు..
*త్వరలో పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే…
పలమనేరు(నేటిధాత్రి:
పలమనేరు అభివృద్ధిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఓ మైలురాయిగా నిలవనుందని స్థానిక శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పట్టణ సమీపంలోని కేటీల్ ఫామ్ వద్ద 33 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి సంబంధించి శుక్రవారం కీలక ముందడుగు పడింది. స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు రెవిన్యూ శాఖ సిబ్బంది కలిసి మార్కెట్ స్థలానికి హద్దులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రైతులు, వ్యాపారులు మరియు వినియోగదారులకు అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆధునిక వసతులతో నిర్మించబడనున్న ఈ మార్కెట్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులకు మంచి ధరలు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
మార్కెట్ నిర్మాణానికి అవసరమైన భూహద్దుల నిర్ణయ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని, వెంటనే పనులు జరిగేలా చూడాలని అధికారులను ఈ సందర్బంగా ఆయన అద్దెశించారు.ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలకు అవసరమైన అన్ని వాణిజ్య, నిల్వ మరియు మార్కెటింగ్ సౌకర్యాలను సమగ్రంగా కల్పించే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ఈ ప్రాంత అభివృద్ధిలో కీలకం కానుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ శ్రీలత,డీన్ ఆఫ్ డైరీ సైన్స్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఈఈ ఉమాశంకర్, పలమనేరు ప్రాజెక్టు అధికారులు డాక్టర్ భారతి, డాక్టర్ అరుణ మరియు గంగవరం తహసిల్దార్ రేఖా, సర్వే అధికారి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ దిలీప్ కుమార్,ఏఎంసీ సెక్రటరీ సంజీవ్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు..
