ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత మొదలైంది-సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ పార్టీ త్యాగాలు చేసిన చరిత్ర అని స్వతంత్రం కన్న ముందు తర్వాత చేసిన త్యాగాల ఫలితంగా 2025 డిసెంబర్ 26 నాటికి వంద ఏళ్ళు పార్టీ చేరుకున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో వెంకటస్వామి విలేకరులతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఏడాది పాటు సంస్థాగత నిర్మాణం సభ్యత్వం నమోదు సెమినార్లు, సధస్సులు, సైకిల్ ర్యాలీలు గ్రామ గ్రామాన ఎర్రజెండా ఎగరవేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఉచిత బస్సు, గృహాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతులకు సగం రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పెంచుతామన్న పెన్షన్ పెంచకపోవడంతో ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని పేర్కొన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్ల బిఆర్ఎస్ నిరంకుశ పాలనలో చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి కూడా అధికారులపై పట్టు సాధించలేదని తెలిపారు. ఇంకా కొంతమంది అధికారులు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సైద్యంతికంగా కాంగ్రెస్ పార్టీకి స్నేహపూర్వక మద్దతు ఇచ్చామని ఆమద్దతు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఇంటి స్థలం లేకుంటే ఇంటిస్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. టిఆర్ఎస్ పాలనలో వివిధ శాఖలలో చేసిన అప్పులను ప్రజలకు తెలిసేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య , తాడవేణి రవి , పిట్టల రామస్వామి, పిట్టల తిరుపతి, కోలని తిరుపతి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.