కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!
తమిళనాడులో కులం, పేదరికం ఒక విరోధాభాస
పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే అధికారానికి ముప్పు
విజయ్ వ్యూహాలు డీఎంకేను దెబ్బకొట్టే అవకాశం
కులాల కుంపట్ల సెగ అంటని బీజేపీ
హైదరాబాద్,నేటిధాత్రి:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే బలంగా వుంటాయన్న సంగతి అదరికీ తెలిసిందే. ఈ నేప థ్యంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎఐడీఎంకెలను, విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏవిధంగా ఎదుర్కొని నెట్టుకు రాగలుగుతుందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దళపతి రాబోయే ఎన్నికలకోసం ఇ ప్పటినుంచే చాపకింద నీరులా తన వ్యూహాలను అమలుపరచడం మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టునుంచి ఆయన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వృధాచలం నియోజకవర్గం నుంచి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే), దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీల స్టాండ్ ఏవిధంగా వుండబోతున్నది కూడా ఆగస్టు నాటికి స్పష్టమయ్యే అవకాశముంది. ముఖ్యంగా పీఎంకేకు ఓబీసీవర్గమైన వన్నియార్లలో మంచి బలముంది. దివంగత సినీ హీరో విజయకాంత్ నెలకొల్పిన డీఎండీకేకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టును కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ, సెమీ`అర్బన్ ప్రాంతాల్లోని దళిత, ఓబీసీ వర్గాల ఓట్లపై టీవీకే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
పీఎంకే, డీఎండీకేల అసంతృప్తి
ప్రస్తుతం డీఎండీకేకు నాయకత్వం వహిస్తున్న ప్రేమలత ఏఐడీఎంకే పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. సీట్ల కేటాయింపులో తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఏఐడీఎంకే నాయకుడుపళినిస్వామిపై ఆగ్రహంతో వున్నారు. ఇక పీఎంకే విషయానికి వస్తే దీని వ్యవస్థాపకుడు రామ్దాస్, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా వున్న అంబుమని రామ్దాస్కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రామ్దాస్, ఏఐడీఎంకేతో నేరుగా చర్చలు జరపాలని భావిస్తుంటే, అంబుమని రామ్దాస్ ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దమధ్య నెలకొన్న విభేదాలకు కారణం. ఈ విభేదాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉత్తర తమిళనాడుకు చెందిన పది జిల్లాల్లో ఈ పార్టీ ప్రభావం అధికం. ఈ అసంతృప్తి వీరిని పీఎంకేవైపుకు మొగ్గు చూపేలా చేస్తే అప్పుడు ఒక్క ఏఐడీఎంకేకు మాత్రమే కాదు డీఎంకేకు కూడానష్టం కలిగించక మానదు. ఎట్లా అంటే డీఎంకే కూటమిలో వున్న విడుత్తలై చిరుతైౖగలల్ కచ్చి (వీసీకే)కు ఈ ప్రాంతంలో దళితుల్లో మంచి బలం వుంది. పైరెండు పార్టీల ప్రభావంతో ఈ ఓ ట్లు కూడా చీలి టీవీకే ఖాతాలోకి వెళ్లకూడదనేం లేదు. క్రైస్తవుడైన విజయ్, వచ్చే ఆగస్టులో వృ ధాచలం నుంచి ప్రారంభించే యాత్రలో వన్నియార్లు (ఓబీసీలు), దళితులు, మత్స్యకార్లు, క్రైస్తవ వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గతంలో వృధాచలం డీఎండీఏకేకు గట్టి పట్టున్న ప్రాంతం. డీఎండీకే, పీఎంకేలు ప్రస్తుతం ఏఐడీఎంకేతో జట్టుకట్టి వున్నాయి.
ప్రస్తుతం విజయ్ ‘టీవీ’ని తన పార్టీ గుర్తుగా చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలోనే ‘టీవీ`కే’కు ఓటువేయండి నినాదంతో ముందుకెళ్లవచ్చు. అదీకాకుండా ‘టీవీ’ ప్రజలకు ఏవిధమైన కష్ట లేకుండా తేలిగ్గా గుర్తుండిపోతుంది కూడా. ప్రస్తుతం విజయ్ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరవుతుండటాన్ని ఏవిధంగా తీసుకోవాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకేకు ఇది సానుకూల పరిణామమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అభిమానం వేరు ఇది ఓటుగా మారడం వేరని చెబుతున్నారు. విజయ్కాంత్ వంటి స్టార్ హీరో పెట్టిన పార్టీకే దిక్కులేదు, ఇప్పుడు విజయ్ పార్టీ కూడా ఇదేబాటలో పయనిస్తుందని అంచనాలు కట్టే నిరాశా వాదులుకూడా లేకపోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే విజయ్ తన ఛరిష్మాతో పదిశాతం ఓట్లు సాధించుకోగలిగితే డీఎంకే కొంప నిండా మునిగినట్టేనన్నది మాత్రం సుస్పష్టం.
యువకుల్లో మద్దతు
వర్తమాన పరిస్థితి పరిశీలిస్తే దళపతికి యువకుల్లో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో, ప్రధానంగా మైనారిల్లో పట్టు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వర్గాలు సంప్రదాయికంగా డీఎంకే మద్దతు దార్లు. ఈ వర్గాలు దళపతిని కేవలం వెండితెరవేల్పుగా మాత్రమే కాదు, ఎంతోకొంత చేసిచూ పించే నాయకత్వ లక్షణాలు కలిగినవాడిగా పరిగణించడం మొదలైంది. మొదట్లో విజయ్ టీవీకేను స్థాపించిన తర్వాత, రాజకీయ పండితులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ కే 5 నుంచి 6శాతం వరకు ఓట్లు సంపాదిస్తుందని అంచనాలు కడుతున్నారు. మరి గతంలో కమల్ పెట్టిన మక్కల్ నిధి మయమ్ (ఎంఎన్ఎం) 2021లో కేవలం 2.52శాతం ఓట్లు మాత్రమేసాధించింది. దీంతో పోలిస్తే టీవీకే చాలా ముందంజలో ఉన్నట్టే లెక్క! అంతేకాదు ఇతర పార్టీ లనుంచి 2`3శాతం ఓట్లు చీల్చగలడన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. తాను సొంతంగా 5శాతం ఓట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికి మొత్తంమీద చూసుకుంటే గరిష్టంగా 8శాతం ఓట్లు సాధించగలడన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలించే వారి అంచనా. అయితే విజయ్ ‘వర్క్ ఫ్రం హోం’ రాజకీయాలు నడుపుతారన్న విమర్శకులు కూడా లేకపోలేదు. ఇదిలావుండగా ఎన్నికలు దగ్గరపడ్డే కొద్దీ ఈ అంచనాల్లో మార్పు కచ్చితంగా వుండి తీరుతుంది. ఎందుకంటే విజయ్ ప్రధానంగా దళితులు, ఆర్థికంగా అణగారిన వర్గాలు, శ్రామికులపై దృష్టి పెట్టి తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది ఓట్ల చీలికవల్ల సాధ్యమవుతుందని అనుకునేదాని కంటే, వివిధ వర్గాల ప్రజల ఆలోచనా శైలిలో వస్తున్న మార్పుల వల్ల అని చెప్పవచ్చు. మరి ఈ వర్గాలే డీఎంకేకు వెన్నెముకగా నిలుస్తున్నారు మరి!!
కులరాజకీయాలు అధికం
తమిళనాడులో కులరాజకీయాల ప్రభావం ఎక్కువన సంగతి తెలిసిందే! కులాభిమానం, పేదరికం అనే రెండు అంశాలు విరోధాభాస వంటివి. ఎందుకంటే పేదలు అన్నివర్గాల్లో వున్నారు. కాకపోతే దళితుల్లో వీరి సంఖ్య అధికం. వన్నియార్లు, గౌండర్లు, థెవరాల వంటి ఓబీసీ కులాలవా రు, ఇప్పుడు విజయ్కు దళితులు పూర్తి అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. ఈ ఓబీసీలకు, దళితులకు ఎంతమాత్రం పొసగదు. ఇప్పుడు పట్టల్ మక్కల్ కచ్చి (పీఎంకే)కు వన్నియార్లలో బలం వుంది. అదే విడుత్తలై ఛిరుతైౖౖగల్ కచ్చి (వీసీకే)కు దళితుల్లోని పరైయార్ వర్గం మద్దతుంది. మరి ఈ రెండు పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకేలకు వ్యతిరేకం కానప్పటికీ, ఒకే కూటమిలో వుండటం సాధ్యంకాదు. ఇప్పుడు వెన్నియార్లు విజయ్కి అభిమానులుగా ఉన్నప్పటికీ, టీవీకేకు అత్యధికశాతం దళితుల మద్దతుండటంవల్ల, వారు పీఎంకేకు అనుకూలంగానే వుంటారుతప్ప దళపతివైపు మొగ్గు చూపరు.
ఏఐడీఎంకే `బీజేపీ కూటమి భవితవ్యం?
ఈవిధంగా ఓబీసీ లెక్కలు సంక్లిష్టమయంగా వున్న నేపథ్యంలో ఏఐడీఎంకాేబీజేపీ కూటమికి అను కూలంగా మారే అవకాశాలు ఎక్కువ. పశ్చిమ తమిళనాడులోని కొంగు వెల్లలార్ గౌండర్లు ఎప్పటికీ ఏఐడీఎంకేకు అనుకూలమే. ఎందుకంటే ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ కులానికి చెందినవాడే! ఉత్తర తమిళనాడులో బలమైన వెన్నియార్ల మద్దతున్న పీఎంకే ఇప్పుడు ఏఐడీఎంకాేబీజేపీ అలయన్స్ వైపు చూస్తుండటం గమనార్హం. దక్షిణ మరియు డెల్టా ప్రాంతాల్లో థేవర్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్సెల్వం, ప్రస్తుత టీటీవీ నాయకుడు దినకరన్లు ఈ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ తిరిగి ఏఐడీఎంకాేబీజేపీ కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అదీకాకుండా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయనార్నాగేంద్రన్ థెవర వర్గానికి చెందినవాడు. పన్నీర్సెల్వం, దినకరన్లు ఎన్డీఏ కూటమిలోకి చేరి తే, అప్పుడు కూటమికి థెవర వర్గంలో తిరుగుండదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే సైద్ధాంతిక ప్రాతిపదిక తప్ప, కులానికి ప్రాధాన్యత లేకపోవడంతో, దానికి ఇప్పటివరకు వున్న ఓట్లశాతంలో ఏవిధమైన మార్పు వుండదు. ఎందుకంటే దీని మద్దతుదార్లు సైద్ధాంతిక ప్రాతిపదికన వుండటం గమనార్హం. అందువల్ల విజయ్ ప్రభావం ఇతర పార్టీ లపై పడినంతగా భాజపాపై పడదు. విజయ్వల్ల బాగా దెబ్బతినేది సీమన్స్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) తమిళనాడుకు మరింత స్వేచ్ఛ కావాలని పోరాడే పార్టీ ఇది. యువకులు ప్రధానంగా రాజ్యాన్ని వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులు. వీరంతా ఇప్పుడు తమ అ భిప్రాయాన్ని విజయ్కి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అధికార డీఎంకే పార్టీ విషయానికి వస్తే, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవు. రాష్ట్రం మొత్తంమీద పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోనే డీఎంకేకు అసలైన ప్రమాదం పొంచివుంది. ఉదాహరణకు 2021లో కువందంపాలయం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థికి 9,776 ఓట్ల మెజారిటీ వచ్చింది. విచిత్రమేమంటే ఇక్కడ కమల్ హసన్ పార్టీ ఎంఎన్ఎంకు 23527 ఓట్లు రాగా, ఎన్టీకే పార్టీకి 17897 ఓట్లు వచ్చాయి. మరి ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే ఏఐడీఎంకేకు వచ్చిన మెజారిటీ ఓట్లకంటే ఎక్కువ. ఇదే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పార్టీల ఓట్లశాతం గమనిస్తే, ఎంఎన్ఎం పార్టీకి వచ్చిన ఓట్లు 18శాతం. 2016 ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పోల్చినప్పుడు డీఎంకే నుంచి చీల్చుకున్న 6శాతం ఓట్లున్నాయి. నాటి ఎన్నికల్లో డీఎంకే ఈ నియోజకవర్గం నుంచి 3శాతం ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం!
ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దళపతి నేతృత్వంలోని టీవీకే మొత్తంమీద పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమవుతుంది.
ఓటుబ్యాంకు రాజకీయాలు, కూటములు కట్టడంలో డీఎంకేకు తిరుగులేదు. దీంతోపాటు కుల రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట! ఈ నేపథ్యంలో దళపతి పార్టీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో నేటి పరిణామం ఒక్క సత్యాన్ని వెల్లడిస్తోంది. సంప్రదాయికంగా తమిళ రాజకీయాల్లో వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఏమీ తెలియని ఒక కొత్త నాయకుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఛరిష్మా ఓటుగా మారితే, అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు సునామీలో కొట్టుకుపోయి, రాష్ట్రంలో కొత్త రాజకీయశకం ప్రారంభం కాగలదు.