రాజకీయానికి కొలమానం కాలమానమే!

కన్నీళ్లు కాదు.. కష్టం జనం కళ్ళకు కనిపించాలి!

`చెట్టు పేరు చేరిపేస్తే అందె ఫలాలు కూడా దక్కవు!

`ఓపిక లేని రాజకీయాలు కొంత కాలమే!

`అదృష్టం అవుగింజంత ఎల్ల కాలం ఉండాల్సిందే!

`ఆవేశ పడితే ఎవరికీ అవకాశాలు రావు!

`ఆందోళన చెందితే పదవులు పరుగేత్తు కుంటూ రావు!

`లక్ష్యం పదవి మాత్రమే కనిపిస్తే రాజకీయం గందరగోళమే.

`కాలం కలిసి వస్తే ఎవరూ రాజకీయాలలో అడ్డుకోలేరు!

`జనం మెచ్చినా పరిస్థితులు ఎదురు తిరుగొచ్చు!

`ఎంత కష్ట పడినా పదవులు రాని వాళ్ళు చాలా మంది వుంటారు!

`కష్ట పడకపోయినా పదవులు వచ్చేవాళ్ళుంటారు.

`ఒక పార్టీలో పదవులు రాని వాళ్ళు ఇతర పార్టీలో పదవులు

అందుకున్న వాళ్ళు వున్నారు.

`పదవుల ఆశతో పార్టీలు మారినా తలరాత మారని వారు వున్నారు.

`కాలాన్ని బట్టి రాజకీయాలు కలిసివచ్చిన వారున్నారు.

`రాజకీయాలు అందరికీ కలిసి రావాలని లేదు.

`పార్టీలో ఉన్నంత మాత్రాన పదవులు దక్కాలని లేదు.

`పదవుల కోసం పరి పరి విధాలా ప్రయత్నం చేస్తూనే వుంటారు

అదృష్టం పరీక్షంచుకుంటారు..

`పదవులు రాక రాజకీయాలు మానుకున్నవారు వున్నారు.

`పదవులే రాజకీయానికి పరమావాది కాదు.

`ప్రజా సేవకు పదవులకు సంబంధం లేదు.

`అతిగా పదవుల మీద ఆశ వున్నవారికి దక్కిన చరిత్ర లేదు.

`పని చేస్తూ పోతుంటే పదవులు రావచ్చు.

`ఎవరో తనకు పోటీ వున్నారని అసహనంతో రాజకీయాలు చేస్తే గౌరవం

కూడా దక్కక పోవచ్చు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

అన్నింటికీ కాలమే సమాదానం చెబుతుందని పెద్దలు ఊరికే అనలేదు. దేనికైనా టైం రావాలని ఇప్పటికీ మనం అనుకుంటూనే వుంటాం. అలాంటి టైమ్‌ వచ్చిన నాడు ఎవరూ ఎవరినీ ఆపలేరు. ఆ టైం వచ్చిన వారిని ఎవరూ ఏమీ చేయలేరు. కాని టైమ్‌ రాకపోయినా, తనకు అన్యాయం జరిగిందని అనుకునే వారు ఈ లోకంలో 99శాతం మంది వుంటారు. టైమ్‌వచ్చిన ఆ ఒక్క శాతం ఇంత మంది కళ్ల ముందు అన్నీ అనుభవిస్తుంటారు. ఇదే అసలైన తిరకాసు. అందుకే రాజకీయానికి కొలమానం కాలమే అని నాయకులు బలంగా నమ్ముతుంటారు. కాని తనకు వచ్చే టైమ్‌ను ఎవరో ఆపారని ఇతరు ల మీద పడి చాలా మంది ఏడుస్తుంటారు. ఏడ్చేవారు అక్కడే వుంటారు. ఎవరి మీదనైతే ఏడుస్తుంటారో వాళ్లు మాత్రం ముందుకు దూసుకెళ్తుంటారు. వారికి కూడా ఎక్కడో అక్కడ ఆగపోయే టైమ్‌ వస్తుంది. ఇలా టైమ్‌ అనేది ఎవరికి ఎంత టైమ్‌ ఇవ్వాలో కూడా అంతే ఇస్తుంది. అందుకే పెద్దలు దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అలాగే ఎల్ల కాలం దీపముండాలి. తాము ఎప్పుడూ గెలుస్తూ వుండాలి. తమ ప్రాభవం ఎప్పుడూ కనిపిస్తూ వుండాలి. తమ ప్రభావం రాజకీయాల్లో అందరికంటే ఎక్కువగా వుండాలని కోరుకునే వారు ఈతరంలో ఎక్కువగా వుంటారు. నిన్నటి తరానికి, నేటి తరానికి రాజకీయల్లో కొంత తేడా వచ్చింది. నిన్నటి తరంలో ప్రజలు పక్కన పెడితే హుందాగా పక్కకు తప్పుకునేవారు. కాని ఇప్పటి నాయకులు అలా కాదు. ఎప్పుడూ తాము రాజకీయాల్లోనే వుండాలి. ఎల్ల కాలం తమ పెత్తనం సాగాలనుకుంటారు. ఇలాంటి సమయంలోనే ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ఆ ఇబ్బందులు ఆయా పార్టీలలో తుఫానులు సృష్టిస్తుంటాయి. కల్లోలం రేపుతుంటాయి. తమకు దక్కని పదవులు ఇతరలకు దక్కొద్దనుకుంటారు. తమ ముందు ఇతరులెవరూ నాయకులగా ఎదుగొద్దనుకుంటారు. అలా అనుకున్నంత మాత్రాన కాలం అందరికీ కలిసి రాకపోవచ్చు. కాలం అనుకూలంగా వున్న రోజల్లో కూడా పదువులు కొందరికి అందక పోవచ్చు. పదవులు అందాల్సిన సమయంలో మౌనం దాల్చి, పార్టీలు ఓడిపోయిన తర్వాత పెడబొబ్బలు పెట్టే వారుంటారు. అందుకే ప్రజలు నాయకుల నుంచి పనులు ఆశిస్తారు. ప్రజా సేవ ఆశిస్తారు. తమకు పదవులు రాలేదని ఆవేదన చెందేవారిని పెద్దగా పట్టించుకోరు. నాయకులు సానుభూతి కోసం ఎంత ప్రయత్నం చేసినా దయతల్చరు. తమకు ఈ రాజకీయాలు వద్దనుకున్నా కూడా కొందరిని పదవులు వెత్తుక్కుంటూ వస్తాయి. అలా పదవులు అందుకున్న వారిలో మాజీ ప్రదాని పి.వి. నర్సింహారావు. పెరంబదూర్‌ బాంబు దాడిలో మాజీ ప్రదాని రాజీవ్‌గాందీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌పార్టీ అదికారంలోకి వచ్చింది. ఆ సమయంలో సోనియా గాందీ పుట్టెడు దుఖంలో వుండి రాజకీయాలకు దూరంగా వుంటామని చెప్పేశారు. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు సీతారాం కేసరికి అప్పగించారు. ఆ ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీ గెలవడం వల్ల సహజంగా ఏఐసిసి అద్యక్షుడైన సీతారాం కేసరి ప్రధాని అవుతాడని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ పార్లమెంటరీ సమావేశంలో నాయకులంతా పి.వి. నర్సింహారావును ప్రదానిగా చేయాలనుకున్నారు. సీతారం కేసరి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పైగా ఆ సమయంలో పివి. నర్సింహారావు ఎంపి కూడా కాదు. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయలేదు. కాంగ్రెస్‌ నాయకులంతా పివి. నర్సింహారావును ప్రధాని చేయాలనుకున్నారు. పివి. నర్సింహారావు తనకు ఇక రాజకీయాలు చాలని డిల్లీని వదిలేసి, హైదరాబాద్‌ మూటా ముళ్లె సర్ధుకొని వచ్చేశారు. హైదరాబాద్‌లో స్ధిరపడిపోయారు. హుటాహుటిన డిల్లీకి రావాలని పిలుపొచ్చింది. ప్రదాని పదవి చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చింది. ఇంకే ముంది పివి. నర్సింహారావు ఐదేళ్లపాటు ప్రధాని పదవి నిర్వహించారు. ఇదీ కాలమంటే..కాల మహిమ అంటే అని చెప్పకతప్పదు. ఏపి రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని ఓ సినియర్‌ ఎమ్మెల్యే వున్నారు. ఆయన ఎన్టీఆర్‌ కాలం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కాని ఆయన ఇప్పటి వరకు మంత్రి కాలేకపోయారు. కారణం ఆయనకు అర్హత లేకపోవడం కాదు. సామాజిక సమీకరణాలు ఆయనను మంత్రిని కానివ్వలేకపోయాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సమయాల్లో కూడా ఆయన గెలుస్తూ వచ్చారు. అంతటి సమర్ధవంతమైన నాయకుడు. ఆయనకు గెలవడానికి కాలం అదృష్టం కలిసొస్తుందే కాని, మంత్రి కావడానికి ఇప్పటి వరకు కాలం కలిసి రాలేదు. అంతెందుకు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసిఆర్‌. ఆయనకు 1999లో మంత్రి పదవి రాదని ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా ఆయనకన్నా జూనియర్లు మంత్రులయ్యారు. అలా 1999 ఎన్నికల్లో గెలిచినా మంత్రి కాని కేసిఆర్‌, 2004 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎంపిగా గెలిచి, కేంద్ర మంత్రి అయ్యారు. అదే సమయంలో పదవులను ఆయన గడ్డిపోచతో సమానమంటూ అనేక సార్లు పదవులకు రాజీనామా చేశారు. ఆ సమయంలో ఏ ఒక్కసారి ఓడిపోయినా కేసిఆర్‌ రాజకీయం అక్కడితోనే ఆగిపోయేది. తెలంగాణ ఉద్యమం మధ్యలోనే అటకెక్కెది. కాని ఆయన ప్రతిసారి గెలుస్తూ వచ్చారు. ఆఖరుకు తెలంగాణ తెచ్చిన వీరుడయ్యారు. తెలంగాణ దృష్టిలో జాతి పిత అయ్యారు. తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు పని చేశారు. భవిష్యత్తు దేశ రాజకీయాలు సాగించాలనుకున్నారు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నాడు. కాని కాలం కలిసి రాలేదు. పార్టీ ఓడిపోయింది. అంతే ఎంత కాలం దశ నడవాలో అంత కాలమే నడుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఓడపోయిన తెలుగుదేశం పార్టీ ఏపిలో రెండు సార్లు గెలిచింది. నాలుగు సార్లు సిఎం. అయ్యారు. అదే కాల మహిమ. అందుకే రాజకీయాలలో నాయకులకు ఓపిక ఎంతో అవసరం. పదవులు తమ ముందుకు రావాలంటే రావు. వచ్చిన చేతుల్లో నుంచి జారి పోతాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె నిజామాబాద్‌ ఎంపిగా ఓడిపోయారు. అయినా కేసిఆర్‌ ఆమెకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ పదవి తనకు కవిత చిన్నది అనుకున్నది. అందుకే వున్న పదవి కూడా పోగొట్టుకునేందుకు దారి వేసుకున్నది. ఇప్పుడు తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతోంది. పైగా కేసిఆర్‌ పేరును కూడా బద్నాం చేస్తోంది. ఓపిక లేని రాజకీయాలు ఎప్పుడైనా కొంత కాలమే వుంటాయని గతంలోనే పెద్దలు చెప్పారు. సరిగ్గా ఎన్టీఆర్‌ పదవీచ్చుతుడు కావడానికి కూడా కారణం ఇదే. ప్రజలు తాను ఎల్ల కాలం సిఎం.గానే వుంటానని అనుకున్నారు. కాని ఐదేళ్లకే ప్రజలు ఓడిరచారు. దాంతో రాజకీయాలకు కొంత కాలం దూరంగా వున్నారు. రాజకీయాలను కొంత కాలం పట్టించుకోకపోయినా ప్రజలు ఆయనను మళ్లీ గెలిపించారు. కాని పదవి ఆయనతో వుండలేదు. ఏడాదిలోపే ఆయన సిఎం పదవి నుంచి దిగిపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆశపడినంత మాత్రాన అవకాశాలు వచ్చినట్లే వచ్చి చే జారిన సందర్బాలు కూడా ఇలా అనేకం వున్నాయి. అంతెందుకు కాళేశ్వరం కుంగిపోయిందనే వరకు మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి అనే ప్రచారమే వినిపించింది. అప్పటికి కాంగ్రెస్‌ ఎంత ప్రచారం చేసినా బిఆర్‌ఎస్‌దే అధికారం అనుకున్నారు. కాని కాలేశ్వరం ప్రచారం కాంగ్రెస్‌ పార్టీ విసృతంగా చేశారు. ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దానికితోడు ఇతర కారణాలు కూడ అనేకం తోడయ్యాయి. బిఆర్‌ఎస్‌ను గెలవకుండా చేశాయి. కేసిఆర్‌ మూడోసారి సిఎం. కాలేదు. మూడోసారి బిఆర్‌ఎస్‌ అదికారంలోకి వస్తే కేటిఆర్‌ సిఎం. అవుతారన్న ప్రచారం కూడా బాగానే సాగింది. కేటిఆర్‌ అంతకుముందు రెండేళ్ల నుంచి సిఎం. అనే ప్రచారం విసృతంగా సాగింది. కాని కాలేదు. ఈసారి పార్టీయే గెలవలేదు. అంటే కాలం అనుకూలించలేదు. కాలం కలిసి వస్తే ఎవరూ రాజకీయాలలో అడ్డుకునే వారు వుండరు. ఇదిలా వుంటే ఎంత కష్టపడినా పదవులు రాని వాళ్లు కూడా చాలా మందే వున్నారు. దేశంలో ప్రధాని, రాష్ట్రాలలో సిఎం. పదవి ఒక్కటే వుంటుంది. అందరూ ఆ పదవి చేపట్టాలనే అనుకుంటారు. కాని ఒక్కరికే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం రావాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డిలా అదృష్టం కూడా కలిసి రావాలి. కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్లను కాదని రేవంత్‌రెడ్డికి పదవి వచ్చిందంటే ఆయన పడన కష్టం, చేసిన త్యాగం, కలిసి వచ్చిన అదృష్టం. ఏ కష్టం పడకుండానే పదవులు ఊరికే రావు. ఎవరినో నిందిస్తూ రాజకీయాలు చేస్తామంటే జనం కూడా ఒప్పుకోరు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version